Mon May 06 2024 02:18:39 GMT+0000 (Coordinated Universal Time)
ఆజాద్ వల్లనే రాష్ట్రం రెండు ముక్కలయింది
గులాం నబీ ఆజాద్ కారణంగానే ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలయిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు.
గులాం నబీ ఆజాద్ కారణంగానే ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలయిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కు ఆజాద్ తప్పుడు సలహాలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ దయతో వేల కోట్లు సంపాదించుకున్న ఆజాద్ రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అందుకున్నారన్నారు. 2014 నుంచే ఆజాద్ బీజేపీతో సన్నిహితంగా ఉంటూ వచ్చారని, బీజేపీ డైరెక్షన్ లోనే కాంగ్రెస్ పై అసత్య ఆరోపణలు చేశారని చింతామోహన్ అన్నారు.
కాంగ్రెస్ కు పూర్వ వైభవం
రాష్ట్ర విభజనతో ఏపీ ఎంతో నష్టపోయిందన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు ముందుకు సాగడం లేదన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతి పాలయిందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ఏమయిపోయిందో ఎవరికీ అర్థంకావడం లేదన్నారు. మోదీకి జగన్ దత్తపుత్రుడిగా మారారన్నారు. ప్రజా ధనాన్ని అదానీకి జగన్ దోచి పెడుతున్నారని చింతామోహన్ విమర్శించారు. బీజేపీ దేశానికి ఏమీ చేయలేదని, ఏపీలో తిరిగి కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని చింతామోహన్ తెలిపారు.
Next Story