Wed May 08 2024 02:27:31 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ అవినాష్ రెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
తాజాగా వచ్చిన సమాచారం మేరకు.. అవినాష్ రెడ్డికి ఛాతీలో నొప్పి రావడంతో.. తల్లికి చికిత్స చేస్తున్న ఆస్పత్రిలోనే ఆయన కూడా..
కడప ఎంపీ అవినాష్ రెడ్డి అస్వస్థతకు గురయ్యాడు. ఈ రోజే అవినాష్ తల్లి శ్రీలక్ష్మికి ఛాతీలో నొప్పి రావడంతో పులివెందుల నుంచి చికిత్స నిమిత్తం స్పెషల్ అంబులెన్సులో హైదరాబాద్ తరలించాలని భావించారు. విషయం తెలుసుకున్న అవినాష్ హుటాహుటిన పులివెందులకు బయల్దేరారు. మార్గమధ్యంలోనే అంబులెన్సు ఎదురుపడటంతో.. తల్లిని చూసి అంబులెన్స్ వెనకాలే వెళ్లారు. కర్నూల్ నగరంలోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. తల్లి అనారోగ్యం సాకుగా చూపి అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాలేదు.
తాజాగా వచ్చిన సమాచారం మేరకు.. అవినాష్ రెడ్డికి ఛాతీలో నొప్పి రావడంతో.. తల్లికి చికిత్స చేస్తున్న ఆస్పత్రిలోనే ఆయన కూడా అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. ఈ విచారణకు హాజరైతే ఆయన అరెస్ట్ ఖాయమని వార్తలొస్తున్న నేపథ్యంలో విచారణ నుండి తప్పించుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
వివేకా హత్య కేసులో ఇప్పటికే.. అవినాష్ తండ్రి భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన అవినాష్ రెడ్డి.. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడం ఆయనపై అనుమానాలను మరింత బలపడేలా చేసింది. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు ఎప్పుడు హాజరవుతారో ? విచారణలో ఏం నిర్థారిస్తారోనని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Next Story