Tue May 07 2024 21:14:15 GMT+0000 (Coordinated Universal Time)
నాకు ప్రాణహాని ఉంది : దేవినేని ఉమ
వారాహియాత్ర, యువగళం, టిడిపి బస్సు యాత్ర ఇలా.. వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి.
ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఏ పార్టీ.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో తెలియని అనిశ్చితి నెలకొంది. ఎవరికి వారే ప్రజలతో మమేకమయ్యేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. వారాహియాత్ర, యువగళం, టిడిపి బస్సు యాత్ర ఇలా.. వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. అధికార - ప్రతిపక్షాల మధ్య ప్రతిరోజూ మాటలతూటాలు పేలుతున్నాయి. కాగా.. తాజాగా టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ.. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ దేవినేని ఉమ పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలంలో “తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కు గ్యారంటీ” బస్సు యాత్రలో పాల్గొన్న దేవినేని ఉమ తనకు ప్రాణహాని ఉందని చేసిన వ్యాఖ్యలు.. కలకలం రేపుతున్నాయి.
టిడిపి చేపట్టిన బస్సుయాత్ర శనివారం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. ‘‘నన్ను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయి.. నన్ను ఎప్పుడైనా తుదముట్టించవచ్చు’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కొంపల్లిలో తన కారుపై ఎవరో బండరాయితో దాడి చేశారని, ఆ సమయంలో కారు డోర్ తీసి ఉంటే.. తనతో పాటు మరికొందరు కూడా చనిపోయేవారన్నారు. అలాగే పడవ మునిగిపోయినపుడు గోదావరితల్లే తనను కాపాడిందని చెప్పుకొచ్చారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన తన జీవిత ఆశయం ఒక్కటేనని.. టిడిపి అధికారంలోకి వస్తే.. చింతలపూడి ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీటిని నాగార్జున సాగర్ కాలువల్లో పారేలా చేస్తానని హామీ ఇచ్చారు.
Next Story