కేసీఆర్ కొత్త ఫ్రంట్...కథాకమామిషు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత మదిలో మెదిలిన ఈ ఆలోచనపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. తాజాగా ఈ అంశంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీతో చర్చించేందుకు కేసీఆర్ కోల్ కత్తా వెళ్లడంతో ఒక్కసారిగా జాతీయ మీడియా దృష్టి ఈ అంశంపైకి మళ్లింది. బలమైన అధికార భారతీయ జనతా పార్టీ, బలోపేతం అయ్యానని భావిస్తున్న వందేళ్లకు పైగా చరిత్ర గలిగిన కాంగ్రెస్ పార్టీని కాదని కేసీఆర్ కొత్త ఫ్రంట్ మనగలుగుతుందా? దానికి గల అవకాశాలు, భవిష్యత్తు తదితర అంశాలపై చర్చ ప్రారంభమైంది.
కేంద్ర రాజీకీయాలు కొట్టిన పిండి...
టీఆర్ఎస్ పేరుకు ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు కేంద్ర రాజకీయాలు కొట్టిన పిండి. 2004లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ నాయకత్వం స్పందించక పోవడంతో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి అందరి దృష్టిని తనవైపు మళ్లించుకున్న చతురత గల నాయకుడు కేసీఆర్. అనంతరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా పలు ప్రాంతీయ, జాతీయ పార్టీల మద్దతును కూడగట్టే ప్రక్రియలో భాగంగా అందరితో పరిచయలు పెంచుకున్నారు. 2009లో కేవలం రెండే రెండు ఎంపీ సీట్లు సాధించినప్పటికీ ఆమరణదీక్షతో జాతీయ దృష్టిని ఆకర్షించారు. 2014 జూన్ లో ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావంతో కేసీఆర్ చిరకాల వాంఛ నెరవేరింది.
భాషపై పట్టు ఉండటంతో....
ఉద్యమంలో భాగంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై అవగాహనతో పాటు, జాతీయ నాయకులతో పరిచయం పెంచుకున్నారు. తన ప్రసంగాలతో జనాలను ఉర్రూతలూగించే కేసీఆర్ కు హిందీ, ఇంగ్గీష్ భాషలపై గట్టి పట్టుంది. ఎమ్మే తెలుగు చదివిన ఆయనకు మాతృభాషపై ఎంత పట్టుందో, ఇంగ్లీషు, హిందీపై అంతే సాధికారత ఉంది. జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాలని, రాణించాలని కోరుకునే వారికి పర భాషపై పట్టు అవసరం. గతంలో ఎంతోమంది నాయకులు ఆంగ్లం, హిందీపై అంతంత మాత్రమైన అవగాహన కారణంగా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించలేకపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా,ఏపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన కామరాజ్ నాడార్ హిందీ, ఇంగ్లీష్ తెలియక తెరవెనకే ఉండిపోయారు. దేవెగౌడ ప్రధాని అయినప్పటికీ నిలదొక్కుకోలేక పోయారు. తెలంగాణ నేత పీవీకి పెద్దగా ప్రజాదరణ లేకపోయినప్పటికీ బహుభాషావేత్త కావడంతోజాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. హిందీపై అవగాహన లేకపోతే ప్రధాని కావడం కష్టమని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవలే ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు కూడా. తానే అందుకు ఉదాహరణ అని, తనకు హిందీ సరిగా రాకపోవడంతో ప్రధాని కాలేకపోయానని ప్రణబ్ స్వయంగా వెల్లడించారు.
అవకాశాలు ఇక్కడే....
ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఫెడరల్ ఫ్రంట్ కు ఎక్కువ అవకాశాలు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, అస్సోం మినహా ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, ఒడిశా, ఢిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ , మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, అస్సోం, జార్ఘండ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, గోవా తదితర రాష్ట్రాల్లో మూడో ఫ్రంట్ కు ఒక మోస్తరు అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో అసలు ఫ్రంట్ కు అవకాశాలే లేవు. ఇక్కడ జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. దాదానగర్ హవేలీ, డయ్యూడామన్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు తదితర కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా జాతీయ పార్టీలు బరిలో ఉంటాయి. ఇక్కడ ఫెడరల్ ఫ్రంట్ కు చోటులేదు.
అన్ని రాష్ట్రాల్లోనూ...
తృతీయ ఫ్రంట్ కు బాగా అవకాశాలు ఉన్న చోట కూడా ప్రాంతీయ, సిద్ధాంతపరమైన వైరుద్ధ్యాలు తప్పవు. ఉదాహరణకు ఫ్రంట్ కు అవకాశమున్న పెద్ద రాష్ట్రమైన బెంగాల్ లో సీపీఎంకు, తృణమూల్ కాంగ్రెస్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ రెండు పార్టీలు ఒకే కూటమిలో ఉండటం కష్టం. ఉన్నప్పటికీ కలసి ఉండటం ఎంతవరకూ సాధ్యమన్నది ప్రశ్నార్థకమే. మరో పెద్ద రాష్ట్రమైన తమిళనాడులోని రెండు ప్రాంతీయ పార్టీలూ అధికారంలో ఉన్న జాతీయ పార్టీలవైపే మొగ్గు చూపుతుంటాయి. ప్రత్యేక పరిస్థితుల్లో, జాతీయ పార్టీలు బాగా బలహీన పడినప్పుడు మాత్రమే ఇవి ఫ్రంట్ లో చేరతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ మధ్య వైరుధ్యాలు అనేకం. ఈ మూడు ఒకే ఫ్రంట్ లో ఉండటం కష్టమైన పనే. రెండు రాష్ట్రాల మధ్య విభజన వివాదాలు ఇప్పటికీ ఉన్న నేపథ్యంలో కలిసి ప్రయాణించడం కష్టమే. కేరళలో కాంగ్రెస్, సీపీఎంలకు పొసగదు. మమతా బెనర్జీకి ప్రాధాన్యం కలిగిన కూటమిలో కేరళ సీపీఎం ఎంతవరకూ ఇమడగలదన్నది ప్రశ్నార్థకమే. ఒడిశాలోని బిజూ జనతాదళ్ కు కేసీఆర్ తో కలిసి ప్రయాణించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. యూపీలోని ఎస్పీ, బీఎస్పీ, మహారాష్ట్రలోని శివసేన, ఎన్సీపీ, బీహార్ లోని జేడీయూ, ఆర్జేడీ లు ఒకే కూటమిలో ఉండటం ఎంతవరకూ సాధ్యమో చూడాలి. గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ విఫలమైన నేపథ్యంలో కేసీఆర్ కొత్త ఫ్రంట్ పై అనుమానాలు కలగడం సహజమే. ఇప్పటికే శరద్ పవార్ తాను దూరమని చెప్పేశారు. అయినా కూడా ఆయన ఆలోచనలను తక్కువగా అంచనా వేయలేం. కాంగ్రెస్ తగినంతగా బలం పుంజుకోకపోతే ఆస్థానాన్ని మూడో ఫ్రంట్ భర్తీ చేసే అవకాశముంది. బీజేపీకి సుమారు 200 స్థానాలు వస్తాయనుకున్నా....మిగిలిన 350 స్థానాలనూ కాంగ్రెస్, తృతీయ ఫ్రంట్ ల్లో ఎవరు ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే వారికే భవిష్యత్ ఉంటుంది.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- కేసీఆర్