జైట్లీ ఏంటీ... గజిబిజి...?
కొందరు హోటల్ వ్యాపారులు మంత్రి వద్దకు వస్తారు. తినుబండారాల రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని కోరతారు. ప్లేటు కు 50 పైసలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వమని డిమాండ్ చేస్తారు. రూపాయి పెంచుకోండి అంటూ మంత్రి గారు ఉచిత సలహా ఇస్తారు. ఆనందంగా వ్యాపారులు వెళ్లిపోతారు. మంత్రి చెప్పినట్లు రేట్లు డబుల్ చేసేస్తారు. ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. మంత్రి గారు జోక్యం చేసుకుని వ్యాపార వర్గాలతో చర్చలు జరిపి ప్లేటు కు 50 పైసల ధర తగ్గిస్తారు. ఇందులో గ్రహించాల్సిన సూత్రం ఏమిటి? వ్యాపారులకు తమకు కావాల్సిన లాభం దక్కింది. మంత్రిగారికి ప్రజల్లో పరపతీ వచ్చింది.’ 30 సంవత్సరాల క్రితం వచ్చిన ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమాలోనిది ఈ ఘట్టం. తాజాగా జీఎస్టీ రేట్ల సవరింపును చూస్తే ఆ సినిమా గుర్తుకు రావడం ఖాయం. పూటకో రేటుతో జీఎస్టీ పన్ను విధానాలు రోజురోజుకీ మారుతున్నాయి. ఒకే దేశం - ఒకే పన్ను పేరిట జులై నెలనుంచి అమలు చేస్తున్న జీఎస్టీ గందరగోళంగా అపహాస్యం పాలవుతోంది. వివిధ రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కౌన్సిల్ తమ ప్రాపకం పెంచుకోవడానికి, ప్రజలనుంచి వ్యతిరేకత పెల్లుబుకకుండా తాము చర్యలు తీసుకొంటున్నామని చెప్పడానికే పనికొస్తోంది. పన్నుల ఎగవేతను అరికట్టడంతోపాటు సరళమైన విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలు సైతం వస్తుసేవల్లోని మోసాలను సులభంగా కనిపెట్టేందుకు తీసుకొచ్చిందే జీఎస్టీ. ప్రపంచంలోని అత్యధిక దేశాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మన దేశంలో మాత్రం అటు అధికారులకు, ఇటు వ్యాపారులకు మధ్యలో ప్రజలకు అర్థంకాని అయోమయ అవస్థగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలు చాలావరకూ రెండు మూడు స్లాబులకే పన్నును పరిమితం చేశారు. జీరో టాక్సు వస్తువులతోపాటు 5, 12,18,28 అంటూ మనదేశంలో అయిదు స్లాబుల్లో దీనిని అమలు చేస్తున్నారు. ఏ వస్తువును ఏ పరిధిలోకి తేవాలన్నది పెద్ద గందరగోళం. దానికి పన్ను విధానాన్ని తెలుసుకోవడానికి, రిటర్నులు దాఖలు చేయడానికి కంప్యూటర్ల సహా ఆధునిక వ్యవస్థ , సిబ్బంది అవసరం. జీఎస్టీ అమలుపై తనిఖీలు ఎవరు నిర్వహిస్తారనే అంశంపై కూడా అయోమయమే. ఇదేదో కేంద్రపన్ను అన్నట్లుగా రాష్ట్రాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. మరోవైపు కేంద్రానికీ తగిన సిబ్బంది లేరు. వ్యాపారులు పెరిగిన పన్నులను ప్రజల నుంచి కచ్చితంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి కడుతున్నారో లేదో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అంతటి సంక్లిష్టతకు కేంద్రమే వీలు కల్పించింది.
పెరుగుట..పెరుగుట కొరకే...
హోటళ్లలో జీఎస్టీని తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటన చేశారు. 18 నుంచి అయిదు శాతానికి పన్ను దిగి రావాలి. కానీ ఒకసారి ప్రజల నుంచి ఎక్కువ సొమ్ము తీసుకోవడం మొదలుపెట్టిన హోటళ్లు, రెస్టారెంట్లు తినుబండారాల రేట్లలో ఆ పెంపుదలను సర్దుబాటు చేసుకుని ఇప్పటికే అలవాటు పడిన కస్టమర్లకు కుచ్చుటోపీ పెట్టడం ఖాయం. పన్ను రేటు తక్కువ చూపుతారు. కానీ తినుబండారాలే రేటే పెంచుతారు. హళ్లికి హళ్లి సున్నకు సున్న.దీంతో వినియోగదారునికి మిగిలేది శూన్యం. దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణను అమలు చేస్తున్నప్పుడు కనీస స్థాయిలో ప్రణాళిక లేకుండా కేంద్రం తొందరపడిన ఫలితాలను ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు అనుభవిస్తున్నాయి. 25 నుంచి 30 శాతం వరకూ ఆదాయం తగ్గిపోయినట్లుగా రాష్ట్రప్రభుత్వాలు వాపోతున్నాయి. అదే సమయంలో జీఎస్టీ అమలు తర్వాత 10 నుంచి 15 శాతం మేరకు ధరలు పెరిగాయని వినియోగదారులు చెబుతున్నారు. ఇందులో పేద,మధ్యతరగతి,ధనికులన్న భేదం లేదు. అందరిపైనా అదే బాదుడు. చిన్నాచితక వ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి రాకపోయినా తాము పెద్ద షాపుల నుంచి కొనుగోళ్లు చేస్తున్నామంటూ ప్రజలపై భారం మోపుతున్నారు. మనదేశంలో ప్రశ్నించే ప్రజలే తక్కువ. అందులోనూ జీఎస్టీపై సాగిన ప్రచారంతో ధరల పెంపుదల నిజమే కాబోలనుకుంటున్నారు వినియోగదారులు. ఏతావాతా తేలిందేమిటంటే అటు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇటు ప్రజల జేబులు చిల్లవుతున్నాయి. సర్కారీ ఖజానాకు సొమ్ములు చేరడం లేదు.
ప్రయత్నం లేని ప్రయాస...
గడచిన నాలుగు నెలల జీఎస్టీ అనుభవాలను చూసిన తర్వాత అర్థమయ్యే విషయం ఒకటే. ప్రభుత్వం తగినంత కసరత్తు చేయకుండా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లేకుండా హడావిడిగా అమల్లోకి తెచ్చేసింది. దాని ప్రభావం వివిధ రంగాలపై ఇప్పటికే కనిపిస్తోంది. దేనిపై ఎంత పన్ను పడుతుంది? ఏ రకమైన విధానంతో ముందుకు వెళ్లబోతున్నారనే అంశాలపై కనీసం రాష్ట్రప్రభుత్వాలకు కూడా అవగాహన లేకుండానే శాసనసభల తీర్మానాలను ఆమోదింపచేశారు. దేశవ్యాప్తంగా చట్టసభల్లో విస్ర్తుత చర్చలు సాగిన తర్వాత ఆమేరకు సవరణలు, మార్పులు చేర్పులు చేసుకుని జీఎస్టీని అమల్లోకి తెచ్చి ఉంటే బాగుండేది. ప్రజల నిత్యావసర వస్తువులు, ప్రభుత్వాలు చేపట్టిన కాంట్రాక్టు పనులు, సిమెంటు వంటి మౌలిక వసతులకు సంబంధించిన వాటిపై పన్నుల విషయంలోనూ దీర్ఘద్రుష్టితో ఆలోచించకుండా ఆదరాబాదరగా వ్యవహరించడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పన్నుల్లో తరచూ మార్పులు చేయడం కన్ఫ్యూజన్ కు దారి తీస్తోంది. దానికి సంబంధించి పన్నుల రసీదుల నుంచి యంత్రాంగం వద్ద నమోదుల వరకూ అధికభారం పడుతుంది. నిజాయితీగా వ్యాపారాలు చేసేవారికి ఇది పెద్ద తలనొప్పి. ఏదో మార్గంలో పన్నులు ఎగ్గొట్టేవారు ప్రభుత్వ గందరగోళాన్ని పక్కాగా క్యాష్ చేసుకుంటున్నారు. అందులోనూ రాజకీయావసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం మార్పులకు పాల్పడుతోంది. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే అనేక మినహాయింపులు ఇవ్వడం, జీఎస్టీకి తానొక్కడినే బాధ్యుడిని కానంటూ ప్రధాని ప్రకటించడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆర్థిక వ్యవస్థపై చిత్తశుద్ధితో కాకుండా అవకాశవాదంతో కేంద్రం వ్యవహరిస్తోందని ఎకానమిస్టులు ఇప్పటికే విమర్శిస్తున్నారు. జీఎస్టీ విషయంలో ప్రజలు, వ్యాపారులు ఆగ్రహంగా ఉన్నారన్న విషయాన్ని మాత్రం కేంద్రం గుర్తించింది అదొక్కటే కొంచెం సంతోషించాల్సిన అంశం. మరిన్ని మార్పులకు ఇదొక సంకేతంగా
భావించాలి.
-ఎడిటోరియల్ డెస్క్