‘పొగ’ మొదలైంది....!
తెలంగాణలో రాజకీయ పొగ మొదలైంది. నియోజకవర్గాల వారీగా పొమ్మనకుండానే పొగబెట్టడంపై అధికార తెలంగాణ రాష్ట్రసమితి కసరత్తు మొదలుపెట్టింది. మొత్తం 39 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సర్వే రిపోర్టు తెప్పించుకున్నారు సీఎం కేసీఆర్. ఇందులో ఇద్దరు మంత్రులు, ఒక ప్రభుత్వ విప్ కూడా ఉన్నట్లు ధ్రువీకరిస్తున్నారు. వీరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కడం కష్టమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రశేఖరరావు యాక్షన్ లోకి దిగి ఎవరెవరు పనికిరారో ఏరివేత కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.2019 ఎన్నికల్లో పార్టీ తిరుగులేని విజయం సాధించాలనేది సీఎం ఆలోచన. తద్వారా జాతీయంగా చక్రం తిప్పడానికి కూడా వీలవుతుందనే భావనలో ఉన్నారు. హైదరాబాడు లోక్ సభ స్థానాన్ని మినహాయించి మిగిలిన 16 సీట్లు టీఆర్ఎస్ కే దక్కేలా చూడాలని పార్టీ శ్రేణులకు నిర్దేశిస్తున్నారు. 119 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్ఎస్ సెంచరీ కొట్టాలనేది నిర్దేశిత లక్ష్యం. భారీగా పెట్టుకున్న ఈ లక్ష్యాలకు అనుగుణంగానే కొందరికి సీట్లు తప్పించడం మరికొందరికి స్థాన చలనం, ఇంకొందరిని ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఒకరి స్థానాల్లో మరొకరిని బదలాయించాలనే ఆలోచన చేస్తున్నారు.
యూ టర్న్...
రెండు నెలల క్రితం ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామంటూ కేసీఆర్ భరోసా నిచ్చారు. అప్పుడే ఎందుకింత రాజకీయ మార్పు అవసరమైందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. నిజానికి కేసీఆర్ తొమ్మిది నెలల కాలవ్యవధిలో నిర్వహించిన మూడు సర్వేల్లో సగానికి సగం ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని తేలింది. కారణాలు ఏమైనప్పటికీ వీరిలో చాలామంది సొంత వ్యాపార వ్యవహారాల్లో నిమగ్నమవుతున్నారు. ఇంకొందరు హైదరాబాదును స్థిరనివాసంగా మార్చేసుకున్నారు. మరికొందరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. టీడీపీ, కాంగ్రెసుల నుంచి వచ్చి టీఆర్ఎస్ లో చేరిపోయిన వారితో కలిపి చూస్తే 85 మంది వరకూ ఎమ్మెల్యేలు అధికారపక్షం గూటిలోనే ఉన్నారు. వీరిలో 48 మందిపై నెగటివ్ రిపోర్టులు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ, కాంగ్రెసుల నుంచి వచ్చి చేరినవారిలో 15 మంది కి టీఆర్ఎస్ టిక్కెట్టు ఇస్తే గెలవడం కష్టమని సర్వేల్లో తేలినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. మరో 33 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఇందులో తొమ్మిది మంది మాత్రం కొద్దిగా కష్టపడితే గట్టెక్కవచ్చునంటున్నారు. మొత్తం పరిస్థితిని మదింపు చేసుకున్న తర్వాతనే కేసీఆర్ 39 మంది జాబితా తయారు చేసి వీరికి ప్రత్యామ్నాయంగా నియోజకవర్గాల్లో అభ్యర్థులపై దృష్టి పెట్టబోతున్నట్లు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. చివరి అవకాశంగా మరో మూడు నెలలు సమయం ఇస్తున్నట్లు కేసీఆర్ పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రకటించారు.
కాంగ్రెసుకు కౌంటర్...
షెడ్యూల్డు కులాలు, తెగలకు సంబంధించిన రిజర్వుడు నియోజకవర్గాలపైన కాంగ్రెసు పార్టీ దృష్టి పెట్టింది. రిజర్వుడ్ నియోజకవర్గాల్లో నాయకత్వ అభివృద్ధి పేరిట ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా రూపొందించింది. గుజరాత్ లో ఈ ప్రయోగం ఇప్పటికే చేసింది. తెలంగాణను తదుపరి ప్రయోగంగా ఎంచుకుంది. రాహుల్ కు సన్నిహితంగా మసలే కొప్పుల రాజు మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించబోతున్నారు. టీఆర్ఎస్ కంటే కాంగ్రెసులోనే దళిత నాయకత్వం బలంగా ఉంది. రాష్ట్రస్థాయి పేరు ప్రఖ్యాతులున్న దళిత నాయకులు కాంగ్రెసుకు వెన్నుదన్నుగా ఉన్నారు. మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, గీతారెడ్డి, అద్దంకి దయాకర్, సంపత్ వంటివారు నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలోనూ హల్ చల్ చేయగల నాయకులు. ఈ విషయంలో టీఆర్ఎస్ కు కొంత నాయకత్వ కొరత ఉంది. దీనిని సరిదిద్దేందుకు కౌంటర్ స్ట్రాటజీ ని కేసీఆర్ రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దళిత నియోజకవర్గాల్లో నాయకత్వం బలహీనంగా ఉన్నచోట్ల సొంతంగా లీడర్ షిప్ ను డెవలప్ చేయడం , వీలుకాని పక్షంలో ఇతర పార్టీల నుంచి నాయకులను ఆకర్షించి వారికే పగ్గాలు ఇవ్వడం వంటి చర్యలు రానున్న కాలంలో ఆచరణలోకి తేబోతున్నారు. కాంగ్రెసు రెడ్డి, దళిత్ కాంబినేషన్ పై ఎక్కువగా ఆశలు పెట్టుకుంటోంది. దీనిని విచ్ఛిన్నం చేస్తూ రిజర్వుడు నియోజకవర్గాలు కాంగ్రెసు కోటాలో పడకుండా పక్కాగా వ్యవహరించాలని కేసీఆర్ యోచిస్తున్నారు.
ప్రాంతీయ పట్టు..జాతీయానికి మెట్టు...
2019 ఎన్నికల తర్వాత కాంగ్రెసు, బీజేపీలు బలహీనపడి ప్రాంతీయ పార్టీల కూటమి బలపడుతుందని అంచనా. అందుకే ముందస్తుగానే ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ గళమెత్తారు. తనవంతు ప్రయత్నాలు కూడా చేశారు. సంఖ్యాపరంగా తెలంగాణ చిన్న రాష్ట్రం . లోక్ సభలో కేవలం 17 సీట్లతో ప్రాతినిధ్యం వహిస్తోంది. 543 సీట్లు కలిగిన లోక్ సభలో 32 వ వంతుకు సరిపోతుంది ఇక్కడి సంఖ్యాబలం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేది. అందుకే యునైటెడ్ ఫ్రంట్ కాలంలో చంద్రబాబు చక్రం తిప్పగలిగారు. ఇప్పుడు చంద్రబాబు, కేసీఆర్ లకు అటువంటి అవకాశం వస్తుందా? అనేది సందేహమే. ప్రాంతీయ పార్టీలు హవా చెలాయిస్తున్న పశ్చిమబంగ, తమిళనాడు, ఒడిసా రాష్ట్రాలన్నీ తెలంగాణ కంటే పెద్దవే. అక్కడి నాయకత్వమూ కేసీఆర్ కంటే సీనియర్ల అధీనంలోనే ఉంది. పక్క నున్న చంద్రబాబు నాయుడికీ కొన్ని అడ్వాంటేజీలు ఉన్నాయి. అందుకే రాష్ట్రంలో నాయకత్వ బలాన్ని, పటిష్ఠతను నిరూపించుకుంటేనే ఫెడరల్ ఫ్రంట్ లో కీలకభూమిక పోషించగలుగుతుంది. హైదరాబాదు నుంచి ప్రాతినిధ్యం వహించే ఎంఐఎం స్థానాన్ని మినహాయించి మిగిలిన 16 చోట్ల టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలనేది కేసీఆర్ వ్యూహం. తద్వారా దేశానికి టీఆర్ఎస్ నాయకత్వ బలాన్ని చాటిచెప్పాలనుకుంటున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- daliths
- federal front
- indian national congress
- k.chandrasekhara rao
- mlas
- nara chandrababu naidu
- survey report
- telangana
- telangana rashtra samithi
- telugudesam party
- ts politics
- ఎమ్మెల్యేలు
- కె.చంద్రశేఖరరావు
- టీఎస్ పాలిటిక్స్
- తెలంగాణ
- తెలంగాణ రాష్ట్ర సమితి
- దళితులు
- నారా చంద్రబాబు నాయుడు
- ఫెడరల్ ఫ్రంట్
- భారత జాతీయ కాంగ్రెస్
- సర్వే రిపోర్ట్