అసలు యవ్వారం ఇదేనట...!
ప్రత్యర్థి కూటమిని కట్టడి చేయడానికి కేసీఆర్ రంగంలోకి దిగారు. ప్రజల సాక్షిగా భారీ దాడి చేసేందుకు సంకల్పిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాన్ని సాధించేందుకు ప్రతి అస్త్రాన్ని పక్కాగా ప్రయోగిస్తున్నారు. ఆయన మాటల్లోని తీవ్రతను గమనిస్తే ఎంతకైనా తెగిస్తారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి , కాంగ్రెసు పార్టీకి ఉన్న కొన్ని బలహీనతల కారణంగా ముఖ్యమంత్రి చర్యలకు దిగితే ఇబ్బందులు తప్పవనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, కాంగ్రెసులు కలవడాన్ని ఆయన సహించలేకపోతున్నారు. నిన్నామొన్నటివరకూ బలహీనంగా కనిపించిన కాంగ్రెసు పార్టీ టీడీపీతో జట్టుకట్టడం ఖాయమైన తర్వాత బోర విరుచుకుంటోంది. బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తోంది. కాలూచేయి కూడదీసుకుని కదనరంగానికి కదులుతోంది. యుద్ధానికి సై అంటూ రంకెలు వేస్తోంది. ఈ పరిణామాలు సహజంగానే కేసీఆర్ కు రుచించడం లేదు. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తుతున్నారు. మూడో కన్ను తెరుస్తానంటూ కేసీఆర్ గట్టి హెచ్చరికే జారీ చేశారు. తీవ్రమైన దూకుడుతో తెలుగుదేశంపై విరుచుకుపడ్డారు. ఇదంతా పైపైకి చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకుంటూ తెలంగాణ ప్రయోజనాల కోణంలో చేస్తున్న విమర్శలా కనిపిస్తుంది. ‘కానీ ఇందులో లోతైన రాజకీయం దాగి ఉంది. తెలంగాణ రాష్ట్రసమితి ఎదుర్కొంటున్న సంకట పరిస్థితినీ పట్టిచూపుతోంది.’ అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఉన్న సామాజిక బలగం, ఆర్థిక బలం కొంత వెరపు కలిగిస్తున్నాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ..టీడీపి నాయకులను బలంగా ఆకర్షించగలిగింది. దాదాపు శాసనసభలో ఆపార్టీ ఉనికి లేకుండా చేయగలిగింది. కానీ ప్రజాక్షేత్రంలో అంత ఈజీ కాదు. మళ్లీ టీడీపీ తెలంగాణలో జీవం పోసుకుంటుందన్న అనుమానంతోనే కేసీఆర్ టీడీపీని టార్గెట్ చేస్తున్నారనేది రాజకీయ పరిశీలన. అందువల్ల తిరిగి కోలుకోకుండానే టీడీపీని నిర్వీర్యం చేయాలనే వ్యూహంతోనే కేసీఆర్ పద్ధతి ప్రకారం విమర్శలు చేస్తున్నారని భావిస్తున్నారు.
కాంగ్రెసు కాకుండా...
తెలుగుదేశం పార్టీకి అరశాతం ఓట్లు మాత్రమే ఉన్నాయంటూ కేసీఆర్ నమ్మబలికారు. కేవలం ఈ ఓట్లకోసం కాంగ్రెసు పార్టీ ప్రతిపక్షమైన తెలుగుదేశంతో కలవాలా? అంటూ నిలదీశారు. తనను అడిగి ఉంటే ఆ సీట్లను తానే ఇచ్చేవాడినని ఎగతాళి చేశారు. ఇదంతా సైకలాజికల్ గేమ్. నిజానికి కాంగ్రెసుతో టీఆర్ఎస్ కలిసే అవకాశమేలేదు. టీఆర్ఎస్ కు రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థి హస్తం పార్టీయే. 2019 ఎన్నికల్లో అధికారానికి ప్రదాన పోటీదారు. కాంగ్రెసు అవినీతి , అక్రమాలు చేసింది. గతంలో రాష్ట్రప్రజలకు నష్టం చేకూర్చిందంటూ ఎన్ని విమర్శలు అయినా చేయవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణకు పురుడు పోసింది కూడా కాంగ్రెసు పార్టీయే. అది ప్రజలకు కూడా తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రబలితే కచ్చితంగా కాంగ్రెసు పార్టీకి కలిసి వస్తుంది. ఇతర పార్టీలు ప్రధాన పోటీదారులు కాదు . అందువల్ల వారికి పెద్దగా కలిసొచ్చేదేమీ లేదు. అందుకనే వ్యతిరేక ఓటు చీలిపోకుండా కాంగ్రెసు చాలా జాగ్రత్తగా పావులు కదుపుతోంది. పార్టీ నాయకత్వంలో విభేదాలు, బలహీనతలు ఉన్నప్పటికీ కాంగ్రెసు నాయకులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో కలవకతప్పని రాజకీయ అనివార్యతను అంగీకరిస్తున్నారు. తెలుగుదేశం , కాంగ్రెసు కలిస్తే ఒక బలమైన కూటమిగా రూపుదాల్చడం ఖాయం. దీనిని అధికార టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెసు పార్టీపై చేసే విమర్శలకు ఫీల్డు లెవెల్ లో పెద్దగా మద్దతు లభించడం లేదు. అందుకే చంద్రబాబు నాయుడిని , తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శల సెగ రగిలిస్తే ఆ వేడి కాంగ్రెసుకు తగులుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.
గులాబీలో గుబులు...
కమలనాథుల మాట విని తప్పుచేశామా? అన్న అంతర్మథనం మొదలైంది టీఆర్ఎస్ లో. ఇందుకు ప్రధానకారణం సర్వేల్లో వెలుగు చూస్తున్న గణాంకాలు. కాంగ్రెసు, టీడీపీ విడివిడిగా పోటీ చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీ గులాబీ పార్టీతో కలిసేందుకు స్నేహహస్తం చాచింది. కానీ బీజేపీతో తెగతెంపులు చేసుకున్న టీడీపీతో కలిస్తే మోడీ, అమిత్ షాల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని కేసీఆర్ వెనక్కి తగ్గారు. ఫలితంగా టీడీపీ , కాంగ్రెసు గూటికి చేరింది. రాజకీయ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి తప్పని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ సొంతంగా ప్రతిపక్షాల బలాన్ని అంచనా వేసేందుకు ఒక సర్వేను నిర్వహించింది. అందులో టీడీపీకి ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో నాలుగు శాతం మేరకు ఓటు బ్యాంకు ఉన్నట్లుగా తేలింది. టీఆర్ఎస్ కు 2014లో 38 శాతం వరకూ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మరో 4.5 శాతం వరకూ అదనంగా ఓటు బ్యాంకు సమకూరినట్లు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. కాంగ్రెసు ఓటు బ్యాంకు 27 శాతం వరకూ ఉంది. టీడీపీ ఓటు బ్యాంకు కూడా కలిపితే ఇది 31 శాతానికి చేరుకుంటుంది. సీపీఐ,టీజేఎస్ వంటివి చేరితే మరో 1.5శాతం ఓట్ల సమకూరవచ్చనే అంచనా ఉంది. టీడీపీ, కాంగ్రెసుల కూటమి ప్రజల్లో సానుకూల పవనాలు సృష్టిస్తే తటస్థ ఓటర్ల నుంచి 3 శాతం మేరకు స్వింగ్ కనిపించవచ్చనేది రాజకీయ పరిశీలకుల జోస్యం. మొత్తంగా చూస్తే 35 శాతం వరకూ ఓటు బ్యాంకు చేరుకోవచ్చు. ఇది అధికార టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చేందుకు సరిపోతుంది. ఎంఐఎం, బీజేపీ, సీపీఎం వంటి పార్టీల ఓట్లు తీసివేసినప్పటికీ 13 శాతం పైచిలుకు తటస్థ ఓటర్లుంటారు. వీరిలో మెజార్టీ మొగ్గు ఎటువైపు కనిపిస్తే ఆపార్టీకి గెలుపు చాన్సులు పెరుగుతాయి. ఇప్పుడు ఈ గణాంకాలే టీఆర్ఎస్ లో గుబులు రేపుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెసుకంటే 15శాతం పైచిలుకు ఆధిక్యంలో ఉన్నప్పటికీ మహాకూటమి తర్వాత ఆ ఆధిక్యత ఏడుశాతానికి పడిపోతుంది. తటస్థ ఓటర్లు బలంగా కూటమికి మద్దతునిస్తే పోటాపోటీ వాతావరణం ఏర్పడుతుంది. ఇదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయమవుతోంది.
- ఎడిటోరియల్ డెస్క్
- Tags
- indian national congress
- k chandrasekhar rao
- kodandaram
- nara chandrababu naidu
- talangana rashtra samithi
- telangana
- telangana jana samithi
- telangana politics
- telugudesam party
- uttamkumar reddy
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- తెలంగాణ
- తెలంగాణ జన సమితి
- తెలంగాణ పాలిటిక్స్
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- భారత జాతీయ కాంగ్రెస్