రీజన్..సీజన్...అందుకేనా?
అక్రమ వలసదారుల సమస్యతో అసోం అట్టుడికి పోతోంది. గత కొంతకాలంగా ఈ సమస్య ఫలితంగా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గత నెల 30న విడుదల చేసిన జాతీయ పౌర పట్టిక (ఎన్.ఆర్.సి) తో యావద్దేశం అసోం వైపు చూస్తుంది. అక్కడి పరిస్థితిపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ముఖ్యంగా అధికార భారతీయ జనతా పార్టీ, విపక్ష కాంగ్రెస్, అసోం పొరుగున ఉనన రాష్ట్రం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విమర్శలు,ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. రాజకీయంపైన పార్టీలు దృష్టి పెడుతున్నాయి తప్ప సమస్య పరిష్కారానికి అవి చిత్తశుద్ధితో ప్రయత్నిచడం లేదన్న సంగతి స్పష్టంగా అర్థమవుతోంది.
ఇందిర హయాంలోనే.....
నిజానికి అక్రమ వలసదారుల సమస్య ఈనాటిది కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1980 ఫిబ్రవరిలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అఖిల అసోం స్టూడెంట్స్ యూనియన్ (ఎఎఎస్ యూ) విజ్ఞప్తి చేసింది. తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో 1985 ఆగస్టులో త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అప్పటి ముఖ్యమంత్రి హితేశ్వర్ సైనియా, అప్పటి అఖి అసోం స్టూడెంట్స్ యూనియన్ (ఆసో) నాయకుడు ప్రపుల్ కుమార్ మహంతా, కేంద్రం మధ్య కుదిరిన ఈ ఒప్పందం సక్రమంగా అమలుకు నోచుకోలేదు. ఆ తర్వాత అటుకేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయని ఫలితమే ప్రస్తు పరిస్థితికి కారణమని చెప్పక తప్పదు.
సుప్రీం ఆదేశాలతోనే.....
చివరికి 2014లో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా అక్రమ వలసలపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. నిజమైన భారతీయ పౌరులు ఎవరో? అక్రమ వలసదారులు ఎవరు? అన్నది నిగ్గుతేల్చేందుకు జాతీయ పౌర పట్టిక (ఎన్.ఆర్.సి) రూపొందించాలని ఆదేశించింది. ఇందుకోసం ఐఏఎస్ అధికారి ప్రతీక్ హజేలా సారథ్యంలో ఒక కమిటీని నియమించింది. 52 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. మొదటి జాబితాను గత ఏడాది డిసెంబరు 31వ తేదీన విడుదల చేశారు. అప్పట్లో పెద్దగా హడావిడి జరగలేదు. 1.9 కోట్ల మందిని అసలైన అసోం పౌరులుగా గుర్తించారు. తుది జాబితాను జులై 30న విడుదల చేశారు. దాదాపు 3.3 కోట్ల మంది దరఖాస్తులను పరిశీలించారు. సుమారు 68.7 లక్షల కుటుంబాలు సమర్పించిన పత్రాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం నలభై లక్షల మందిని అక్రమ వలసదారులుగా గుర్తించారు.
బంగ్లాదేశ్ నుంచి.....
ఇక్కడి నుంచి రాజకీయం ప్రారంభమయింది. వీరి విషయంలో ఏమీ చేయాలన్న దానిపై స్పష్టత కొరవడింది. వీరిని అక్రమ వలసదారులని గుర్తించి తిరిగి బంగ్లాదేశ్ కు పంపించాలా? లేక భారత్ లోనే ఉంచి ప్రత్యేక పౌరులుగా గుర్తించాలా? అనే విషయమై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. భారత్ తో బంగ్లాదేశ్ నాలుగువేల కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటోంది. ఇందులో అసోం 263 కిలోమీటర్ల సరిహద్దును బంగ్లాదేశ్ తో కలిగి ఉంది. సరిహద్దులో కంచె నిర్మాణం పూర్తి కాకపోవడం, మరికొన్ని చోట్ల సరైన గస్తీ లేకపోవడం, మరికొన్ని చోట్ల వాగులు, వంకలు, నదుల కారణంగా కంచె లేకపోవడంతో బంగ్లా నుంచి అక్రమ వలసలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లో పెరుగుతున్న జనాభా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అక్కడ లేకపోవడంతో వలసల ప్రవాహం పెరిగిపోతోంది. వలస వచ్చే వారిలోఎక్కువ మంది ముస్లింలే కావడం గమనార్హం. వీరంతా బ్రహ్మపుత్ర నదిలోయ ప్రాంతంలో విస్తరించారు. సౌరవంతమైన నేలలు, నీటి అవకాశం ఉండటంతో వ్యవసాయంతో పొట్టపోసుకుంటున్నారు. వీరు ధుబ్రి, గోల్ పర, కరీంగంజ్, బార్ పేట తదిర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. ఆధార్, పాన్, ఓటరు వంటి గుర్తింపు కార్డులతో స్థానికులుగా వీరు చెలామణి అవుతున్నారు. కాలక్రమంలో వీరి ప్రాబల్యం పెరిగి స్థానికులు మైనారిటీలుగా మిగిలిపోయారు. ఈపరిస్థితి ఉద్రిక్తతలకు కారణమైంది.
ఓటు బ్యాంకుగా......
రెండేళ్ల క్రితం వరకూ రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ వీరిని ఓటు బ్యాంకులుగా మలచుకుంది. వారి విషయంలో ఉదాసీనంగా, చూసీ చూడనట్లు వ్యవహరించింది. అక్రమ వలసదారుల ఉనికితో బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలో ఏఐయూడీఎఫ్ (ఆల్ ఇండియా యూనియన్ ఆఫ్ డెమొక్రటిక్ ఫ్రంట్) పార్టీ ఆవిర్భవించింది. స్థానికుల ప్రయోజనాల పరిరక్షణ పేరుతో భారతీయ జనతాపార్టీ వీరికి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. అక్రమ వలసదారుల విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోందన్న హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ చెబుతున్నారు. వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు సెప్టంబరు ఆఖరు వరకూ అవకాశం ఇచ్చామని, ఆ తర్వాత కూడా ట్రైబ్యునళ్లను ఆశ్రయించే అవకాశం ఉందని హామీ ఇస్తున్నారు. ఇప్పటికిప్పుడు వారిని బంగ్లాదేశ్ కు తిప్పి పంపమని చెబుతున్నారు. ప్రత్యేక కాలనీల ఏర్పాటు, శరణార్థులుగా గుర్తింపు, పనిచేసుకోవడానికి అవకాశం కల్పించడం, ఓటు హక్కు, పౌరసత్వం మినహా అన్ని అవకాశాలు కల్పించడం వంటి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ దీనిపై ధ్వజమెత్తుతున్నారు. బెంగాల్ మాట్లాడే ముస్లింలపట్ల వివక్షతతో వ్యవహరిస్తున్నారన్నది ఆమె అభియోగం. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అక్రమ వలసదారుల సమస్యను రాజకీయంగా వాడుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనపడుతోంది. ఇక విపక్ష కాంగ్రెస్ నంగినంగిగా మాట్లాడుతుంది. ఎన్నికల వేళ పార్టీలు ఇంతకు మించి మాట్లాడ లేవన్నది నిజమే.....!
-ఎడిటోరియల్ డెస్క్