పాక్ ఈ విషయంలో గ్రేట్....!
దాయాదిదేశమైన పాకిస్థాన్ ను ప్రపంచ దేశాలు ఒకింత అనుమానంగా చూస్తాయి. ఆఖరికి దాని మిత్రదేశమైన చైనా కూడా పూర్తిగా విశ్వసించదు. నిన్న మొన్నటి దాకా పాకిస్థాన్ ను బుజ్జగించి ఇబ్బడి ముబ్బడిగా సాయం చేసిన అమెరికాదీ అదే ధోరణి. పాక్ పాలకులకన్నా సైన్యానిదే కీలకపాత్ర పోషించడం, ఉగ్రవాదానికి ఊతమివ్వడం, కయ్యానికి కాలుదువ్వడం, అస్థిర రాజకీయాలు ఇందుకు ప్రధాన కారణాలు. దేశ చరిత్రలో ఇంతవరకూ ఏ ప్రధాని పూర్తికాలం పదవిలో కొనసాగక పోవడం అక్కడి అస్థిర రాజకీయాలకు నిదర్శనం. మూడుసార్లు ప్రధాని పదవి చేపట్టిన నవాజ్ షరీఫ్ అర్థంతరంగానే వైదొలగడం గమనార్హం. 70వ దశకంలో జనరల్ జియా ఉల్ హక్, 90వ దశకంలోని పర్వేజ్ ముషార్రఫ్ వంటి సైనిక పాలకులు దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. ఇన్ని లోపాలున్నప్పటికీ పాక్ ప్రజాస్వామ్యంలో ఒక మంచి సంప్రదాయం ఉంది. తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించే సత్సంప్రదాయం ఆ దేశంలో ఉంది. అధికార పార్టీ సహజంగా అధికార బలాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికలలో లబ్ది పొందే అవకాశం ఉండటం,, విపక్షాల న్యాయబద్ధమైన హక్కులను కాలరాస్తుందన్న అనుమానంతో ఈ సంప్రదాయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. సైనిక పాలకులు, పౌర పాలకులు ఎందరు వచ్చినా దీనిని కొనసాగించడం అభినందనీయం.
త్వరలో జరగనున్న ఎన్నికలకు.....
వచ్చే నెల 25న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ విధానానికి మళ్లీ పట్టం కట్టారు. తాత్కాలిక ప్రధానిగా నసీరుల్ ముల్క్ ను ఎంపిక చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా, ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారిగా పనిచసిన ముల్క్ రెండు నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన అభ్యర్థిత్వాన్ని అటు అధికారపార్టీ అయిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) విపక్షమైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఏకగ్రీవంగా ఆమోదించడం విశేషం. ఈ రెండు నెలల పాటు పాలన వ్యవహారాలను చక్కదిద్దడంతో పాటు పార్లమెంటుకు, ప్రావిన్స్ లకు ఎన్నికలను నిర్వహించే బాధ్యత నసీరుల్ ముల్క్ దే. ఆయన దేశ రాజకీయాల్లో తటస్థంగా వ్యవహరిస్తారన్న పేరుంది. ఆయన వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే పాకిస్థాన్ జాతీయుడు తమ దేశంలో లేరని ప్రధాని షాషిద్ అబ్బాసి పేర్కొనడం గమనార్హం. నసీరుల్ ముల్క్ పేరును ప్రధాని అబ్బాసీతో పాటు, ప్రతిపక్ష నాయకుడు ఖుర్షీద్ ఖాన్ ఉమ్మడిగా ప్రతిపాదించడం విశేషం. ముల్క్ ఆధ్వర్యంలో పాక్ ఎన్నికలు స్వేచ్ఛగా,నిష్పక్ష పాతంగా జరుగుతాయన్న విషయంలో ఎవరికీ, ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది.
మూడు ప్రధాన పార్టీలు.....
ఇక ఎన్నికల విషయానికొస్తే మూడు ప్రధాన పార్టీలు బరిలోకి దిగనున్నాయి. నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలోని ప్రస్తుత అధికార పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్), దేశ రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర గల భుట్టోల కుటుంబ పార్టీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రిక్ ఇన్సాఫ్ (పీటీఐ)పార్టీలు రంగంలో ఉన్నాయి. 2013 ఎన్నికల్లో పీపీపీని ఓడించి నవాజ్ షరీఫ్ అధికారాన్ని చేపట్టారు. పనామా పత్రాల కుంభకోణంలోఆయనను గత ఏడాది చివరలో సుప్రీంకోర్టు దోషిగా తేల్చడంతో షరీఫ్ వైదొలగడం, తనకు విశ్వాస పాత్రుడైన షాషిద్ అబ్బాసీని ప్రధాని పీఠంపై కూర్చోపెట్టి తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. రేపటి ఎన్నికల్లో షరీఫ్ సోదరుడు షెహబాజ్ ను ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తేనున్నారు. ఆయన ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రి. నవాజ్ షరీఫ్ సొంత రాష్ట్రం పంజాబ్ కావడం గమనార్హం. రాష్ట్రంలో షరీఫ్ కుటుంబానికి గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో పార్టీ గట్టెక్కింది. మిత్రపక్షమైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) బలమైన అంచనాలతో రంగంలోకి దిగనుంది. ఈ పార్టీకి లౌకిక పార్టీగా పేరుంది. గతంలో జుల్ఫికర్ భుట్టో, అనంతరం ఆయన కుమార్తె బెనజీర్ భుట్టో, తర్వాత ఆమె భర్త అసిఫ్ ఆలీ జర్దారీ పార్టీకి సారథ్యం వహించారు. ప్రస్తుతం బెనజీర్ కుమారుడు బిలావల్ భుట్టో పార్టీకి సారథిగా ఉన్నప్పటికీ తండ్రిదే కీలక పాత్ర. 2008-2013 మధ్య కాలంలో పదకొండో అధ్యక్షుడిగా పనిచేసిన జర్దారీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. 2007లో భార్య బెనజీర్ భుట్టో హత్యానంతరం నుంచి ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. సొంత పట్టణమైన నవాబ్ షా నుంచి బరిలోకి దిగనున్నట్లు 62 సంవత్సరాల జర్దారీ ప్రకటించారు. గతంలో 1990,1993లో రెండు సార్లు జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన పీపీపీ ప్రస్తుతం సింథ్ ప్రావిన్స్ లో అధికారంలో ఉంది. ఇది భుట్టోల స్వస్థలం. సంప్రదాయంగా ఈ ప్రావిన్స్ పీపీపీకి పట్టం కడుతోంది. ఇక్కడ హిందువులు కూడా ఎక్కువే.
మాజీక్రికెటర్ పార్టీ.....
అధకారాన్ని చేజిక్కించుకోగలమన్న ధీమాను ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రిక్ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ వ్యక్తం చేస్తోంది. పనామా పత్రాల కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకు వచ్చి, సుప్రీంకోర్టులో పోరాడి నవాజ్ షరీఫ్ ను గద్దె దించడంలో ఇమ్రాన్ ఖాన్ చురుగ్గా వ్యవహరించారు. పీపీపీ, ముస్లిం లీగ్ లు గతంలో దేశాన్ని ఏలి, రాజకీయాలను భ్రష్టు పట్టించాయని, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని ఇమ్రాన్ ఖాన్ కోరుతున్నారు. గత ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ భంగపడినా, ప్రస్తుతం ఈ పార్టీ ఖైబర్ ఫంక్తూన్ క్వా ప్రావిన్స్ లో అధికారంలో ఉంది. పాక్ ఎన్నికలు ఆ దేశంతో పాటు పొరుగున ఉన్న భారత్ కు, దక్షిణాసియాకు ఆసక్తి కలిగించేవే.
-ఎడిటోరియల్ డెస్క్