నిర్ణయం... ఎవరికి అనుకూలం...?
కొన్ని గంటల్లో మొదలై..మరికొన్ని గంటల్లో ముగిసే ఉత్కంఠభరిత ప్రజాస్వామ్యఘట్టం. తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించాక జరుగుతున్న మొదటి ఎన్నిక. ఆందోళనల నుంచి అధికారపీఠానికి ఎగబాకిన కేసీఆర్ ను తిరిగి గద్దెనెక్కిస్తారో, అనుగ్రహించి రాష్ట్రమిచ్చిన హస్తానికి తొలిసారి అవకాశమిస్తారో ఓటరే తేల్చుకోవాల్సిన తరుణం. ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. రాజకీయపార్టీలు గుండెల్లో గుబులు రేకెత్తుతోంది. సర్వేలు, అంచనాలు, అభిప్రాయాలు రకరకాల ఫలితాలను నిర్దేశించాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేని సందిగ్ధతకు తావిచ్చాయి. ఇప్పుడు తమ బలాబలాలను సమీకరించుకుని చివరిక్షణాల్లో పూర్తిస్థాయి పోల్ కేక పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది పార్టీలకు. ప్రచారం ముగిసింది మొదలు అంతర్గత వ్యూహాల్లో నిమగ్నమై నియోజకవర్గాలలో పైచేయి సాధించేందుకు నేతలు సర్వవిధాలుగా ప్రయత్నించారు. ప్రజానిర్ణయం తమ భవితకు ఆలంబన కాబోతోంది. అందుకే నాయకులు చివరి పరీక్షకు సిద్ధమవుతున్నారు. సామదానభేదోపాయాలన్నిటినీ వెలికి తీస్తున్నారు. అంతర్గత సర్దుబాట్లతో అసంతృప్తులను మచ్చిక చేసుకోవడం మొదలు ఫైనల్ సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. శుక్రవారం సాయంత్రం వరకూ అలుపెరుగని పోరాటమే వారిది.
రాజకీయ నిఘా...
సొంత యంత్రాంగం ఏంచేస్తోందన్న అంశం కంటే పొరుగు పార్టీ ఎత్తుగడలేమిటన్న దానిపై ప్రత్యర్థులకు ఉత్కంఠ ఎక్కువయిపోయింది. రాజకీయ నిఘా నియోజకవర్గాల వారీ కొనసాగుతోంది. డబ్బుల పంపిణీ, మద్యం సరఫరా, బేరసారాల వంటివాటిపై నిఘా పెడుతున్నారు. అధికార యంత్రాంగానికి ప్రత్యర్థులను పట్టించి అదుపుచేయాలని చూస్తున్నారు. కోట్ల రూపాయలు పట్టుబడటంలో రాజకీయ సమాచారమే కీలక పాత్ర పోషించింది. ఎన్నికల యంత్రాంగం పోలీసుల సహకారంతో చేస్తున్న తనిఖీలు దాదాపు తూతూమంత్రమే. వాహనాలు తనిఖీలు చేసి పంపేస్తున్నారు. అయితే రాజకీయ ఒత్తిడితో సమగ్ర సమాచారంతో వచ్చిన ఫిర్యాదులపై సీరియస్ గా ద్రుష్టి పెడుతున్నారు. ప్లాస్టిక్ గొట్టాల వంటి అసాధారణ రూపాల్లో డబ్బును పంపే ఏర్పాట్లు చేసుకున్నాయి పార్టీలు. కానీ చాలాచోట్ల దొరికిపోయారు. దీనికి ప్రధాన కారణం ప్రత్యర్థులు గట్టి నిఘా పెట్టి ఉంచడమే. రాజకీయ పార్టీల్లో ఛోటామోటా నాయకులు పరస్పరం పార్టీలు మార్చుతుంటారు. వారికి తమ నేతల ఆనుపానులు పక్కగా తెలుసు. దాంతో నేతల గోత్రాలను వారు బయటపెడుతుంటారు. దాంతో ఈజీగానే మనీ మూవ్మెంట్ తెలిసిపోతోంది. ముందస్తుగా తరలించిన డబ్బు, ఇప్పటికే ఒక దఫా పంపిణీ చేసిన చోట్ల మినహా మిగిలిన మనీ పంచడం తలకు మించిన భారంగా మారింది.
సొమ్ము కోసం ఎదురుచూపులు...
ఓటర్లు కూడా తెలివి మీరిపోయారు. కూలినాలి చేసుకుని పొట్ట పోసుకునే శ్రామిక వర్గాల్లో ఎన్నికలంటే డబ్బులు ఇస్తారనే భావనను రాజకీయపార్టీలు పెంపొందించాయి. ఏ పార్టీ , ఏ నేత అనే దానితో సంబంధం లేకుండా ఆరోజు ఎవరు ఎక్కువ మొత్తం ముట్టచెబితే వారికి ఓటేయాలనే అంచనాతో ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామప్రాంతాల్లో ఎంతోకొంత మేరకు రాజకీయ పార్టీలు కొనుగోళ్ల మనీ ముట్టచెప్పాయి. ఆశించిన స్థాయిలో డబ్బులు రాలేదని కొందరు అసంత్రుప్తినీ వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేయమని అడగడానికి వచ్చిన చిన్నాచితక నాయకులను నిలదీస్తున్న ఘట్టాలూ చోటుచేసుకుంటున్నాయి. బహుముఖ పోటీ నెలకొన్న స్థితిలో ఈసారి కచ్చితంగా అన్ని పార్టీల నుంచి డబ్బులు ముడతాయనే ప్రచారం బాగా సాగింది. వాస్తవానికి అంతపెద్ద మొత్తాలను నాయకులు పంపిణీ చేయలేకపోతున్నారు. అధికారిక నిఘాకు తోడు ప్రచార ఖర్చులు పెరిగిపోయాయి. అందువల్ల డబ్బులు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది. నోట్ల రద్దు తర్వాత ముందుగా జాగ్రత్త పడినవారికి మినహా కోట్ల రూపాయల బ్లాక్ మనీని ఒక్కసారిగా డంప్ చేయడం సాధ్యం కావడం లేదు. సొమ్ములున్నప్పటికీ పంపిణీ చేయడం ఎలాగో తెలియక తలలు పట్టుకుంటున్నారు కొందరు నేతలు.
హాట్ అవర్స్...
నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. క్షణ క్షణం ఉత్కంఠ నెలకొంది. ప్రజాస్వామ్యపరీక్షలో విజేతలుగా నిలవాలనే తపన ఒకవైపు, అసలు ఓటరు ఏ నిర్ణయం ప్రకటిస్తాడో తెలియని ఉత్కంఠ మరోవైపు వారిని వెన్నాడుతున్నాయి. కోట్లాది రూపాయలను ఇప్పటికే వెచ్చించారు. ఓటరు దేవుడిపైనే భారం వేశారు. రెబల్స్ గా నిలిచి ఓట్లు చీలుస్తారనుకుంటున్నవారిని గడచిన రెండు రోజులుగా సంప్రతిస్తున్నారు. వారికి ప్రత్యేక ప్యాకేజీలు మాట్లాడుతున్నారు. వివిధ సామాజికవర్గాల నాయకులను కూడా సంప్రతిస్తున్నారు. పది ఓట్లు ఉంటే చాలు వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. అపార్టుమెంట్లకు సామూహిక భోజనాలు మొదలు అన్నిరకాలుగానూ ప్రలోభయత్నాలు సాగించారు. తుది అంకంలో బేరసారాల జోరు మరింతగా పెరిగింది. పార్టీ కార్యకర్తలు, ఛోటా నాయకుల ద్వారా నిధుల పంపిణీ అనేది కొంతమేరకే ఫలిస్తుంది. అందువల్ల కులనాయకుల్లో పలుకుబడి ఉన్నవారికీ నిధులు అందచేసేందుకు చివరి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాము ఆశించిన స్థాయిలో సొమ్ము తమ చేతికి రాలేదని ఓటర్లు భావిస్తుంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోయిందని నాయకులు చెబుతున్నారు. ఓటరును పోలింగు బూతునకు తెచ్చి ఓటు వేయించుకోగలిగితేనే ఫలితం. 2014లో 70శాతం లోపునకే పర్సంటేజీ పరిమితమైంది. ఇప్పుడున్న బహుముఖ పోటీ నేపథ్యంలో పర్సంటేజీ పెరుగుతుందని అధికారయంత్రాంగం ఆశిస్తోంది.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- bharathiya janatha party
- chief minister
- indian national congress
- k chandrasekhar rao
- left parties
- nara chandrababu naidu
- telangana
- telangana jana samithi
- telangana rashtra samithi
- telugudesam party
- ts politics
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీ.ఎస్. పాలిటిక్స్
- తెలంగాణ
- తెలంగాణ జన సమతి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- ముఖ్యమంత్రి
- వామపక్ష పార్టీలు