యాంకర్ ని చాచిపెట్టి కొట్టాలనుకుందట
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వెండితెరపై ప్రదర్శించే అభినయమైనా, అందమైనా, నిజ జీవితంలో ప్రవర్తించే తీరైనా, చూపే ధైర్య సాహాసాలైనా అన్నీ చర్చనీయాంశాలే. తాను బొంబాయి వచ్చిన నాటి నుంచి నేటి వరకు తన జీవితాన్ని తెరిచి పెట్టిన పుస్తకంలా రహస్యాలంటూ ఏమీ లేకుండా అనేక సార్లు విడమర్చి చెప్పిన ఏకైక కథానాయిక కంగనా రనౌత్. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులతో వివాదాలను కెమెరా ముందు ధైర్యంగా ప్రస్తావించిన కంగనా ఇప్పుడు ఒక టెలివిషన్ షో యాంకర్ ని తన ఆగ్రహంతో కొట్టినంత పని చేసేసింది.
'ది వాయిస్ ఆఫ్ ఇండియా సీజన్-2 ' అనే టెలివిషన్ కార్యక్రమానికి అతిధిగా హాజరైన కంగనా రనౌత్ ఆ షో నిర్వహించే యాంకర్ సుగుంధ మిశ్రా తీరుపై తన అసహనాన్ని బహిర్గత పరిచి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మిమిక్రి లో దిట్టైన సుగుంధ మిశ్రా ని ఆ కార్యక్రమ న్యాయ నిర్ణేతలు సలీం మర్చంట్, సింగర్ షాన్ లు కంగనా రనౌత్ వాయిస్ ని ఇమిటేట్ చేయమని కోరగా ఆవిడ కంగనా రనౌత్ ముందు కంగనా వాయిస్ తో పాటు నటనని అనుకరిస్తూ తన ప్రతిభ ప్రదర్శించే ప్రయత్నం చేసింది. సుగుంధ మిశ్రా మిమిక్రికి విసుగు చెందిన కంగనా, "తనని చాచిపెట్టి చెంప పై కొట్టాలని వుంది." అంటూ నిర్మొహమాటంగా చెప్పటంతో న్యాయ నిర్ణేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. కానీ సమయ స్పూర్తితో వ్యవహరించిన యాంకర్ సుగుంధ మిశ్రా టాపిక్ డైవర్ట్ చేసి షో ని సాఫీగా కొనసాగించింది.