విజయాలతో జోరు పెంచిన సీనియర్ హీరో
అక్కినేని కుటుంబ కథానాయకులందరు కలిసి తెరను పంచుకున్న చిత్రం మనం విడుదలయ్యే ముందు వరకు కింగ్ నాగార్జున వరుస పరాజయాలతో తన మార్కెట్ ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టుకున్నారు. 2014 లో విడుదలైన మనం ఘన విజయం సాధించటంతో ఆయన కోసం కథలు వినటానికి కొంత కాలం విరామం ఇచ్చి తన ద్వితీయ తనయుడు అక్కినేని అఖిల్ పరిచయ చిత్రం కోసం దాదాపు పది నెలలు అనేక కథా చర్చలతో మధన పడ్డారు. ఈ సమయంలోనే ఆయన బుల్లి తెర పై మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అఖిల్ పరిచయ చిత్రం వినాయక్ దర్శకత్వంలో ఖరారు ఐన తరువాత నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెప్పిన కుటుంబ కథ ని అంగీకరించి స్వయంగా తన నిర్మాణంలోనే సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి తన కెరీర్ ట్రాక్ రికార్డు గా ఆ చిత్రాన్ని నిలుపుకున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా విజయం సాధించిన రెండు నెలల వ్యవధిలోపే ఆయన విజయ పరంపరను కొనసాగిస్తూ ఊపిరి చిత్రం విడుదలై భారీ వసూళ్లనే రాబట్టుకుంది. ఊపిరి చిత్రం తో నాగ్ హ్యాట్ ట్రిక్ విజయాలు నమోదు చేశారు.
ఊపిరి చిత్రం అనంతరం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ చిత్రీకరణలో పాల్గొంటున్న సమయంలోనే, ఓంకార్ దర్శకత్వంలో రాజు గారి గది 2 ప్రారంభోత్సవం చేయటమే కాక, తనకి డబల్ బ్లాక్బస్టర్ ఇచ్చిన కల్యాణ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయటానికి అంగీకారం తెలిపారు. ఈ మూడు చిత్రాలలో ముందుగా ఓం నమో వెంకటేశాయ ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదలైన వెంటనే మార్చ్ నుంచి తన కాల్ షీట్స్ ను తాజాగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి కేటాయించేసాడు. ఈ చిత్రంలో ఒక యంగ్ హీరో కి కూడా స్కోప్ ఉండగా ఆ పాత్రను నిఖిల్ పోషిస్తున్నాడు.
2017 ఫిబ్రవరి లో ఓం నమో వెంకటేశాయ, వేసవిలో రాజు గారి గది 2 , ద్వితీయార్ధంలో కల్యాణ కృష్ణ, చందూ మొండేటిల చిత్రాల విడుదలలతో ఏడాదిలో మొత్తం నాలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధపడుతున్న ఏకైక సీనియర్ హీరో అక్కినేని నాగార్జున.
- Tags
- నాగార్జున