హీరో కాకపోయినా ఇండస్ట్రీలోనే ఉండేవాడిని
హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఘాజి చిత్రం ఈ నెల 17 న విడుదలవుతుంది. ఈ చిత్రం పై వున్న అంచనాలను ఆకాశానికి చేరుస్తూ మెగా స్టార్స్ వాయిస్ ఓవర్ తో ఘాజి కథ ప్రేక్షకులకు చేరనుంది. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ హిందీ లో ఘాజికి వాయిస్ ఓవర్ ఇవ్వగా, తెలుగు లో మెగా స్టార్ చిరంజీవి, తమిళంలో ప్రముఖ నటుడు సూర్య వాయిస్ ఓవర్ లు ఇవ్వటంతో ఘాజి లేటెస్ట్ ట్రైలర్ లు మూడు భాషల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మెగా స్టార్స్ వాయిస్ ఓవర్ లు తాను నటించిన సినిమాకి కుదరటం మరిచిపోలేని అనుభూతి అని చెప్తున్నా రానా దగ్గుబాటి తాను హీరో కాకముందు పరిశ్రమలో చేసిన సినిమాల గురించి, భవిష్యత్లో తన తాత రామ నాయుడు కోరిక నెరవేర్చటానికి తాను చేయబోతున్న సినిమా విషయాలని ప్రస్తావించారు.
"యాక్టర్ గా వైవిధ్యమైన చిత్రాలనే చేయాలనుకుంటాను. అందుకే గ్యాప్ ఎక్కువ వస్తున్నా బాహుబలి, ఘాజి, తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ డ్రామాలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాను. అయితే నాకు కేవలం హీరోగానే కొనసాగాలనే నియమాలు ఏమి లేవు. నేను కథానాయకుడు కాకముందు కూడా విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, దర్శకత్వ శాఖ వంటి పలు విభాగాలలో 75 కు పైగా చిత్రాలకు పని చేసాను. బాబాయ్ వెంకటేష్ నటించిన లక్ష్మి చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను. ఒకవేళ హీరో కాకపోయినా చిత్ర పరిశ్రమలోనే ఉండేవాడిని. నాగ చైతన్య తో కలిసి చిత్ర నిర్మాణాలు చేపట్టనున్నాను. అలానే నాగ చైతన్య నేను ఒక మల్టీ స్టారర్ చేయాలనేది తాత కోరిక. ఆయన ఆ ప్రాజెక్ట్ సెట్ చేసే పనులలో ఉండగానే చివరి శ్వాస విడిచారు. కచ్చితంగా ఆయన కోరికని నెరవేరుస్తాం. ఆ ప్రాజెక్ట్ అతి త్వరలో ఉంటుంది." అని వివరించారు రానా దగ్గుబాటి.
- Tags
- రానా దగ్గుబాటి