అసహజ డిమాండ్తో ఎన్నాళ్లీ పోరాటం?
రాజకీయాల్లో ఎలాంటి డిమాండ్లు అయినా సరే.. కాలగమనంలో మరుగున పడిపోతూ ఉంటాయి. పార్టీలు మళ్లీ కొత్త అంశాలు భుజానికెత్తుకుని ప్రజలను ఇంప్రెస్ చేసే ప్రయత్నాల్లో పడుతుంటాయి. ఆచరణ సాధ్యం కాని కొన్ని డిమాండ్లను కూడా రాజకీయ మైలేజీ కోసం కొన్ని సందర్భాల్లో వినిపించినప్పటికీ.. పార్టీలు వాటిని త్వరగానే వదిలించుకుంటూ ఉంటాయి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత భిన్నంగా వ్యవహరిస్తోంది.
వైకాపా ప్రస్తుతం రెండు రకాల ఎజెండాలతో ముందుకు సాగుతోంది. ఒకటి ప్రత్యేకహోదా. ఏపీ కి ప్రత్యేకహోదా వచ్చే అవకాశం లేదని చాలా స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా.. చంద్రబాబు రాష్ట్ర ప్రజలిన మోసం చేశాడని, కేంద్రం ముందు సాగిలపడి.. రాష్ట్రానికి మేలు చేసే హోదాకు తిలోదకాలు ఇచ్చారని విమర్శించడానికి ఉపయోగపడుతుంది గనుక.. వారు ఆ పాయింట్ విడిచిపెట్టడం లేదు. అందులో రాజకీయ అవసరం ఉన్నది గనుక.. దాన్ని వదలకపోవడం అర్థవంతమే అనిపిస్తుంది.
అదే సమయంలో కొత్తగా దేశవ్యాప్తంగా బ్లాక్ మనీ ని వెల్లడించిన వారి పేర్లు బయటపెట్టాలంటూ జగన్ కొత్త ఉద్యమం భుజానికెత్తుకున్నారు. హైదరాబాదులో ఒక వ్యాపార వేత్త 10 వేల కోట్లు చూపించారని చంద్రబాబు అన్నందుకు, జగన్ నే అన్నారంటూ వీరు ప్రతివిమర్శలు చేశారు. అసలు ఆ నిధులు ప్రకటించింది చంద్రబాబు బినామీలే అనే అనుమానం తమకు ఉన్నదని అందుచేత.. ఆ పేర్లు బయటపెట్టాలని కోరుతూ జగన్, ప్రధాని మోదీకి ఒక లేఖ రాశారు.
నల్లధనం వెల్లడించిన వారి పేర్లను కేంద్రం బయటపెట్టే అవకాశం ఎంతమాత్రమూ లేదు. అయితే వైకాపా నాయకులు మాత్రం తమ జగన్కు క్లీన్చిట్ ఇవ్వడం కోసం అన్నట్లుగా పదేపదే అదే పాట పాడుతున్నారు. ఏదో ఒకటిరెండురోజులకు ఆ అంశాన్ని పక్కన పెడతారనుకుంటే శనివారం నాడు కూడా.. పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్మీట్ పెట్టి.. కేంద్రం తక్షణం నల్లకుబేరుల వివరాలు బయటపెట్టాలంటూ డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. అసహజమైన, ఆచరణసాధ్యం కాని డిమాండ్లను ఆపద్ధర్మంగా వాడుకోవాలే తప్ప, వాటిని ఎంత త్వరగా వదిలించుకుంటే పార్టీలకే అంత మంచిదని వైకాపా తెలుసుకోవాలి.