Thu May 02 2024 19:48:02 GMT+0000 (Coordinated Universal Time)
బండి సంజయ్ నేడు దీక్ష
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు దీక్షకు దిగనున్నారు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు దీక్షకు దిగనున్నారు. తమ పార్టీ నాయకులపై దాడులకు దిగడమే కాకుండా అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ ఆయన నేడు జనగామలో దీక్ష చేయనున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు ఆయన దీక్ష చేపట్టనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో బీజేపీ నాయకులు కవిత ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు తమ పార్టీ నేతలపై దాడులు చేశారని బండి సంజయ్ ఆరోపించారు.
దాడులకు నిరసనగా...
దాడులు చేయడమే కాకుండా తమ పార్టీ నేతలపైనే అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో పాటు తాను స్వయంగా దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు కొద్దిసేపు దీక్ష చేసి ప్రభుత్వంపై తమ నిరసనను తెలియచేయనున్నారు.
Next Story