Tue May 21 2024 01:58:43 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : ట్రిపుల్ ఆర్ టాలీవుడ్ తీస్తే.. తెలంగాణలో డబుల్ ఆర్ నడుస్తుంది
తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జహీరాబాద్ లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జహీరాబాద్ లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే మీపై వారసత్వం పన్ను వేయబోతున్నారని తెలిపారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ అంటే ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుదని ఆయన అన్నారు. డబుల్ ఆర్ ట్యాక్స్ ను వ్యాపారవేత్తలు కట్టాల్ససి వస్తుందన్నారు. డబుల్ ఆర్ ట్యాక్స్ కు షాక్ ఇవ్వకపోతే తెలంగాణలో రానున్న ఐదేళ్లలో మరింత పతనమవుతుందని తెలిపారు. మీ సంపదలో 55 శాతం వెనక్కు లాక్కుంటామని చెబుతుందన్నారు.
లిక్కర్ స్కామ్ లో...
కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వరకూ పాకిందన్నారు. తెలుగు సినిమా ఇండ్రస్ట్రీ త్రిబుల్ ఆర్ తో సూపర్ హిట్ సినిమా ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి డబ్బులు పంపుతుందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ప్రజల సొమ్ముకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. లిక్కర్ కేసు బయటపడ్డాక ఇద్దరు తోడు దొంగలు ఎవరో అర్థమయిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకగూటి పక్షులేనని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే వారు ముస్లింలకు లాభం చేకూర్చేలా వ్యవహరించారన్నారు.
రెండూ ఒకటే...
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ తోడు దొంగలేనని, ఒకరిని ఒకరు కాపాడుకోసం ప్రయత్నించుకుంటూనే ఉంటారని అన్నారు. కాంగ్రెస్ పేదలను పేదవారిగానే ఉంచాలని చూసిందన్నారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీీ, ఓబీసీ హక్కులను కాలరాసిందన్నారు. మాదిగ రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాజ్యాంగం అంటే కాంగ్రెస్ కు గౌరవం లేదన్న మోదీ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించిన మొదటి రోజు నుంచే రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ను అవమానపర్చిందన్నారు. డబుల్ ఆర్ ట్యాక్స్ తో ప్రజలు విసిగిపోయారన్నారు. మోదీ ప్రాణం ఉన్నంతవరకూ రాజ్యాంగాన్ని కాపాడతామని తెలిపారు. రాజ్యాంగంపై తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరన్నారు.
Next Story