అమెరికాలో తెలుగు విద్యార్ధి కాల్చివేత
అమెరికాలో ఓ తెలుగు విద్యార్థిని ఓ దుండగుడు కాల్చి చంపాడు. కాలిఫోర్నియా నగరంలో ఆదివారం తెల్లవారుజామున నల్లజాతి దుండగులు జరిపిన కాల్పుల్లో వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెందిన మామిడాల వంశీరెడ్డి(27) మృతి చెందాడు. వంశీ మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ సంఘటనతో వంగపహాడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. భువనగిరిలోని వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన వంశీరెడ్డి ఎమ్మెస్ చదివేందుకు అమెరికాలోని కాలిఫోర్నియాకు 2015 సెప్టెంబర్లో వెళ్లాడు. కాగా ఇటీవలే ఎమ్మెస్ పూర్తి చేసిన వంశీరెడ్డి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు.
దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తిని వంశీరెడ్డి అడ్డుకోబోగా .,అతడు తుపాకీతో కాల్చి చంపి పరారైనట్టు తెలుస్తోంది. అమెరికాలో జాతి వివక్ష పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ హత్య జరిగిందన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. సిలికాన్ వ్యాలీలోని ఓ స్టోర్లో పనిచేస్తున్న వంశీ.., శనివారం రాత్రి డ్యూటీ ముగించుకొని తన గదికి తిరిగివస్తుండగా హత్యకు గురయ్యాడు. డ్రగ్స్ వాడిన ఓ తెల్లజాతి వ్యక్తి వంశీపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై అక్కడి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో ఇతని హత్య వార్త తెలిసిన స్థానిక టీఆర్ఎస్, బీజేవైఎం నాయకులు అతని కుటుంబాన్ని పరామర్శించి తమ సంతాపం తెలిపారు. వంశీ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేలా తెలంగాణా ప్రభుత్వం సాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు వారిని కోరారు.