ఇక్కడ టీఆర్ఎస్ గెలవడం కష్టమేనా?
ఆదిలాబాద్ జిల్లా అధికార పార్టీలో అసమ్మతి చల్లారలేదు. పైగా రోజురోజుకూ పెరుగుతుండటం పార్టీ కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యేగా రేఖా నాయక్ వ్యవహరిస్తున్నారు. ఆమె టీఆర్ఎస్ గుర్తుపై గెలిచి ఖానాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆరు నెలల క్రితం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ టీఆర్ఎస్ లో చేరికతో రెండు వర్గాల మధ్య వైరం మొదలయింది. పార్టీ చేరిన మొదటి రోజు నుంచి వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ టిక్కెట్ తనదేనని రమేష్ రాథోడ్ ప్రచారం చేస్తుండటాన్ని రేఖానాయక్ జీర్ణించుకోలేక పోతున్నారు. రమేష్ రాథోడ్ పై గతంలో పోలీసు కేసు కూడా నమోదు చేసేంత వరకూ వెళ్లారు.
రమేష్ రాథోడ్ వర్సెస్ రేఖానాయక్....
దీంతో అధిష్టానం జోక్యం చేసుకుని సర్దుబాటు చేసింది. ఇక ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఏ కార్యక్రమం జరిగినా బలప్రదర్శనకు దిగుతున్నాయి. ఇటీవల మంత్రి హరీశ్ రావు పర్యటనలో కూడా ఈ సంఘటన చోటు చేసుకుంది. రమేష్ రాథోడ్, రేఖానాయక్ వర్గాలు రెండు పోటాపోటీగా నినాదాలు చేయడం, ఆధిపత్య పోరును ప్రదర్శించడం హరీశ్ రావుకు చికాకు తెప్పించిందంటున్నారు. అయితే రమేష్ రాథోడ్ కు పార్టీ కండువా కప్పేటప్పుడే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. రేఖానాయక్ ను ఇబ్బంది పెట్టే పని చేయవద్దని కూడా సూచించారు. అయితే అధినేత మాటలను రమేష్ రాథోడ్ వర్గం చెవికెక్కించుకోలేదు. దీంతో ఈపంచాయతీ తిరిగి ముఖ్యమంత్రి వరకూ వెళ్లిందంటున్నారు. రమేష్ రాథోడ్ ను పిలిచి మాట్లాడాల్సిందిగా మంత్రి హరీశ్ రావుకు కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. ఖానాపూర్ లో ఇవే వర్గ విభేదాలు కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకి అక్కడ కష్టాలు తప్పేలా లేవు.
- Tags
- టీఆర్ఎస్