జల్లికట్టు తరహా ఉద్యమం చేద్దాం : కేవీపీ
జల్లి కట్టు కోసం తమిళులు చేస్తున్న ఆందోళనను ఆదర్శంగా తీసుకోవాలని., ముఖ్యమంత్రి కదలి వస్తే తమిళుల తరహాలో ఆందోళనలకు మద్దతిస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. జల్లి కట్టు కోసం తమిళులు చేసిన ఆందోళన స్ఫూర్తిదాయకమని., ప్రత్యేక హోదా., వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు., విశాఖకు రైల్వే జోన్ వంటి అంశాల కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ పోరాటానికి చంద్రబాబు నాయకత్వం వహించాలని., బాబు ముందుకు వస్తే సినీ., పారిశ్రామిక., రంగాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కలిసి వస్తారని చెప్పారు.
ఆంధ్రా ప్రజలు అడిగేవి గొంతెమ్మ కోర్కెలు కాదని రాజధాని నిర్మాణానికి నిధులు., దుగరాజు పట్నం పోర్టు., పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు., కడపలో స్టీల్ ఫ్యాక్టరీ., ఆర్ధిక లోటు భర్తీ., 9,10 షెడ్యూల్లో ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల విభజన కోసం తమిళుల తరహాలో పోరాటం చేసేందుకు చొరవ చూపాలని కోరారు. జల్లికట్టు వద్దని సుప్రీం కోర్టు తీర్పునిస్తే నాలుగు రోజుల ఆందోళనతో ఆర్డినెన్స్ తెచ్చుకున్నారని., ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అలాంటి పోరాటమే చేయాలని కేవీపీ కోరారు. కేంద్రం విదిల్చే వాటితో సరిపెట్టుకోకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతయుతమైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రులు కోరుకోని విభజన జరిగి మూడేళ్లు గడుస్తున్నా తగిన న్యాయం జరగలేదని., ఆంధ్రను మిగిలిన రాష్ట్రాలతో సమానంగా నిలబెట్టే పోరాటానికి తక్షణమే చంద్రబాబు నాయుడు సిద్ధమై సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడాలని పిలుపునిచ్చారు.
- Tags
- కేవీపీ