జానాకే మైక్ ఇస్తే సరిపోతుందా?
అసెంబ్లీని విపక్షాలు ఒక రోజు బహిష్కరించాయి. భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రభుత్వం తమకు అవకాశమివ్వలేదంటూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఎంలు ఒకరోజు సభకు గైర్హాజరయ్యాయి. ఈమేరకు స్పీకర్ కు ఆ పార్టీలు లేఖ రాశాయి. భూసేకరణ చట్ట సవరణ సందర్భంగా తమకు చర్చల్లో పాల్గొనే అవకాశం కల్పించలేదన్నది విపక్షాల వాదన. అసెంబ్లీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగాయి. ముఖ్యంగా సీపీఎంను ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానించారని, ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే సున్నంరాజయ్య గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. స్పీకర్ ను కలిసి కాంగ్రెస్ నేతలు తమ మనోవేదనను వెల్లడించారు. ఎంతసేపూ మా నేత జానారెడ్డికే మైక్ ఇస్తున్నారని, ఆయనతో పాటు తమకూ అవకాశమివ్వాలని కోరారు. అంతేకాకుండా శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్ రావు తమపై నిరంతరం ఎదురుదాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఫిర్యాదు చేశారు. భూసేకరణ చట్టంపై తనకు మాట్లాడే అవకాశమివ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అయితే విపక్షాలు తిరిగి సభకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. తాను విపక్షాలపై విమర్శలు చేయలేదని...వాస్తవాలనే సభముందుంచానని ఆయన తెలిపారు.