తన సంగతి సరే, మోదీకి కూడా పులిమేస్తే ఎలా?
రాజకీయ నాయకుల్లో ముందూ వెనుకా చూసుకోకుండా, తనకు ఏది తోస్తే అది బయటకు మాట్లాడేసే నాయకులు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. రాజకీయాల్లో చాలా సీనియర్, ప్రస్తుతం తెలుగుదేశం తరఫున ఎంపీ అయిన జేసీ దివాకర్ రెడ్డి అలాంటి నోటి దురుసు ఉన్న నాయకుల్లో ఒకరు. చాలా విషయాల్లో ఆయన ఎదుటివారిని, తమ స్వపక్షం వారిని కూడా నొప్పిస్తున్నాననే సంగతి స్పృహలో లేకుండా విచ్చలవిడిగా కామెంట్లు చేస్తుంటారు.
అలాంటి జేసీ దివాకర్ రెడ్డి ఇవాళ రాజకీయాల్లో అవినీతి గురించి, ప్రత్యేకహోదా, జగన్ వంటి అంశాల గురించి మాట్లాడారు. రాజకీయాల్లో అవినీతి, జనానికి డబ్బులిచ్చి ఓట్లు వేయించుకోవడం ఇవాళ చాలా సాధారణమైపోయిందని అంటున్న జేసీ.. తన దగ్గరినుంచి ప్రధాని నరేంద్రమోడీ వరకు అందరూ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచి గెలిచిన వాళ్లమే అంటూ స్వీపింగ్ స్టేట్ మెంట్ ఇవ్వడం విశేషం. తన సంగతి సరే కానీ, చివరికి స్వచ్ఛ రాజకీయాలకు తానే చిరునామా అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీకి కూడా డబ్బు రాజకీయాల బురద పులిమేయడం జేసీ మాటలు విన్న వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది.
ప్రత్యేకహోదా అనేది ఏపీకి ఇచ్చే ఉద్దేశం కేంద్రానికి లేనే లేదని జేసీ దివాకరరెడ్డి చాలా కాలం ముందునుంచి చెబుతూనే ఉన్నారు. సోమవారం మీడియా ముందు మాట్లాడినప్పుడు ఆయన ఆ అంశం గురించి అసలు మాట్లాడుకోవడం కూడా అనవసరం , సమయం వృథా అని వ్యాఖ్యానించడం విశేషం. బుద్ధి లేనివాళ్లు మాత్రమే హోదా గురించి మాట్లాడుతున్నారని జేసీ చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ ఇప్పటికీ హోదా గురించి సాగిస్తున్న పోరాటాల వల్ల ఎవ్వరికీ ప్రయోజనం ఉండదంటూ జేసీ దెప్పి పొడిచారు. అవి నిష్ఫలం అని ఆయన పేర్కొన్నారు.