తెలుగుదేశం నాయకుల్లో టెన్షన్ టెన్షన్!
ఆర్డర్ కాపీ ని తీసుకుని, అసెంబ్లీ కార్యదర్శికి ఆ ఆర్డర్ కాపీని అందించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా, రేపు అసెంబ్లీకి హాజరు కానున్నట్లు ప్రకటించారు. ఒకవేళ తన సస్పెన్షన్పై అధికార పార్టీ మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, తన న్యాయపోరాటం కొనసాగుతుందని రోజా చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం వుందనీ, హైకోర్టు తీర్పుని వక్రీకరించి అధికార పార్టీ నేతలు మాట్లాడితే, హైకోర్టు పరిగణనలోకి తీసుకుని, చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని రోజా చెబుతున్నారు.
మరోపక్క, రోజా తన పట్ల అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారనీ, తనకు న్యాయం జరగాల్సి వుందనీ, రోజాకి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని టీడీపీ ఎమ్మెల్యే అనిత చెబుతుండడం గమనార్హం. ఎమ్మెల్యే అనితపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారనీ, ముఖ్యమంత్రిపైనా ఆమె అసభ్యకర ఆరోపణలు చేశారనీ, సభలో ఆమె ప్రవర్తన అత్యంత జుగుప్సాకరంగా వుందని.. రోజాపై వచ్చిన ఆరోపణల మేరకు అసెంబ్లీ నుంచి ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.
ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ స్పీకర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ వివాదంపై చర్చిస్తోంది. అయితే, ఈ కమిటీ రోజాతోపాటు మరికొందరిపై చర్యలు తీసుకునేలా పావులు కదుపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, తన సస్పెన్షన్ విషయమై రోజా కోర్టుకెళ్ళి, కోర్టు నుంచి ఊరట పొందడంతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి