పార్లమెంటులో తుస్సుమన్న గులాబీ బ్రేకులు
పోలవరం నిర్మాణాన్ని కేంద్రప్రభుత్వమే బాధ్యతగా తీసుకున్నది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాం గనుక, దానికి సంబంధించిన ప్రతి పైసా ఖర్చు తామే పెడతాం అని, పనుల నిర్వహణను పర్యవేక్షించే ఏజన్సీగా మాత్రమే ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఏపీకి ప్రామిస్ చేసిన స్పెషల్ ప్యాకేజీలో ఆ మేరకు స్పష్టత ఇచ్చారు కూడా. పోలవరం పనులు మరి కొన్నాళ్లలో వేగం పుంజుకునే అవకాశం ఉన్నదనీ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో పోలవరం నిర్మాణానికి బ్రేకులు వేయడానికి లేదా, మార్పు చేర్పులు చేయించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటులో చేసిన ప్రయత్నం తుస్సుమంది.
గురువారం నాడు పార్లమెంటులో పోలవరానికి సంబంధించిన చర్చ సాగింది. తెలంగాణ రాష్ట్ర ఎంపీ సీతారాం నాయక్ దీన్ని లేవనెత్తారు. ఎలాంటి అనుమతులు ఉత్తర్వులు లేకుండానే.. జాతీయ ప్రాజెక్టుగా పనులు చేసేస్తున్నారంటూ ఆయన తప్పుపట్టారు. ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు గానీ.. ఎత్తు తగ్గించాలి. ఇప్పుడున్న ఎత్తువల్ల భద్రాచలం రాములవారి ఆలయం కూడా మునిగిపోతుంది అని ఆయన ప్రస్తావించారు. అయితే ఈ వాదనల్ని కేంద్రమంత్రి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడం విశేషం. భద్రాచలం మునిగిపోయే సమస్యే లేదని.. ప్రాజెక్టును ఆపేది కూడా సాధ్యం కాదని మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ సభలో చెప్పారు. ముంపు ప్రాంతా విషయంలో పోలవరం పై ఒదిశా ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలను కూడా మంత్రి తోసిపుచ్చారు.
అయితే మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ పోలవరం ఎత్తు తగ్గించాలంటూ పార్లమెంటులో లేవనెత్తిన డిమాండు ఆయన సొంత అభిప్రాయమా లేదా తెరాస పార్టీ విధానమా అనే విషయంలో మనకు స్పష్టత లేదు. ఎందుకంటే.. కేసీఆర్ గానీ.. ఇతర తెరాస పెద్దలు గానీ ఎన్నడూ పోలవరం ఎత్తు తగ్గింపు అనే అంశాన్నే ఇప్పటిదాకా లేవనెత్తలేదు. వారెవ్వరికీ సంబంధం లేకుండా సీతారాం నాయక్ ఈ అంశాన్ని రేపి ఉంటే గనుక.. అనవసరంగా పార్టీకి ఇలాంటి అపకీర్తి అంటగట్టినందుకు ఆయన పశ్చాత్తాపపడాల్సి రావచ్చు.