బ్రేకింగ్ : మళ్లీ రేపటికి
పదిరోజుల లాగానే...అలాగే వాయిదా పడటం...తిరిగి ప్రారంభమవ్వడం, ఆందోళనలు చేయడం లోక్ సభలో ఆనవాయితీగా మారింది. అవిశ్వాసం పై చర్చకు ఎదురు చూస్తున్న వారికి ఈరోజు కూడా నిరాశే ఎదురయింది. వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్ సభలో తిరిగి ఆందోళన చేశారు అన్నాడీఎంకే సభ్యులు. కావేరి బోర్డును ఏర్పాటు చేయాల్సిందేనంటూ వారు నినాదాలు చేశారు. ఆందోళనల మధ్యనే ప్రభుత్వం స్థాయి సంఘం నివేదికలను ప్రవేశపెట్టింది. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి మరీ అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. తమిళ ప్రజలను రక్షించాలంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ చదివి విన్పించారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని పదే పదే కోరినా ఫలితం లేదు. సభ ఆర్డర్ లో లేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.