Thu Apr 18 2024 19:09:14 GMT+0000 (Coordinated Universal Time)
వంద మందికి ప్రాణదానం..సూసైడ్ స్పాట్ కే స్పాట్...
By Telugu Post6 Feb 2017 11:14 AM GMT
కారణం ఏదైనా క్షణికావేశంలో తనువు చాలించాలనుకునే వారిలో అనేక మందికి టక్కున గుర్తుకు వచ్చేది ప్రకాశం బ్యారేజీ. ఇటు గుంటూరు అటు కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న బ్యారేజీ వద్ద ఆత్మహత్య చేసుకునేందుకు ఆయా జిల్లాల వాసులు రావడం పరిపాటిగా మారింది. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడని తెలిసినా చస్తే చావనీ... మనకెందుకులే అనుకునే నేటి రోజుల్లో వారిని కాపాడడమే తన పని అన్నట్లుగా హెడ్ కానిస్టేబుల్ఒకరు బ్యారేజీ వద్ద కళ్లల్లో ఒత్తులు వేసుకుని వారిని నీడలా వెంటాడుతున్నాడు.ఇలా ఇప్పటి వరకు సుమారు 100 మంది ప్రాణాలను కాపాడి శభాష్ అనిపించుకున్నాడు. ఆయనే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసే బండ్ల నాగేశ్వరరావు. పనితీరు, సమర్థతను గుర్తించిన అర్బన్ ఎస్పీ త్రిపాఠీ ఆదివారం తన కార్యాలయానికి పిలిపించుకుని నగదు రివార్డు అందించి అభినందించారు.
రెండేళ్ల నుంచీ బరాజ్ పైనే...
బండ్ల నాగేశ్వరరావు 1990లో ఆదిలాబాద్ జిల్లాలో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు.1997లో గుంటూరు జిల్లాకు వచ్చారు. కానిస్టేబుల్గా గురజాల, చేబ్రోలు, లాలాపేట స్టేషన్లలో పనిచేశారు. 2014 నుంచి తాడేపల్లి స్టేషన్లో విధులు నిర్వహస్తున్నారు. తాడేపల్లి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రకాశం బ్యారేజీపై ఔట్పోస్టులో విధులు నిర్వహిస్తున్నారు.సాధారణంగా ఔట్పోస్టులో పనిచేసే వారు ఔట్పోస్టుకే పరిమితం అవుతుంటారు. కానీ నాగేశ్వరరావు క్షణం కూడా ఔట్పోస్టులో కూర్చోరు. విధులకు హాజరైంది మొదలు బ్యారేజీపై తిరుగుతుంటారు. ఏ వ్యక్తిపై అనుమానం కలిగినా వారిని నీడలా వెంటాడుతుంటారు.వారు ఆత్మహత్య చేసుకునేందుకు నీటిలో దూకే ప్రయత్నంలో ఉండగానే వెనుక నుంచి వారిని గట్టిగా పట్టుకుంటారు. అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్ళి ఇంట్లో వారికి ఫోన్ చేసి కనుక్కుంటారు. వారిని నయానో, భయానో ఔట్పోస్టులోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇస్తారు.
ఆత్మహత్యలొద్దని కౌన్సిలింగ్...
క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడితే నీపై ఆధారపడిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి? పిల్లలు, తల్లిదండ్రుల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తూ వారికి కౌన్సెలింగ్ ఇస్తారు. భవిష్యత్తుపై ఆశలు కలిగేలా చేస్తారు. అనంతరం అక్కడకు వచ్చే కుటుంబ సభ్యులకు ఆ వ్యక్తిని అప్పగిస్తారు. ఈ విధంగా ఇప్పటి వరకు సుమారు 100 మంది వరకు కాపాడి ఉంటాడని అంచనా.నీటిలో దూకిన వారిని కూడా కాపాడిన సందర్భాలు ఉన్నాయి.. 9వ తరగతి విద్యార్థితో పాటు యువకులు, మధ్య వయస్కులు సైతం నీటిలో దూకగా వారిని కాపాడాడు. నాగేశ్వరరావుకు ఈత వచ్చినప్పటికీ తనతో పాటు ఉండే మోకును వారికి అందించడం... లేదంటే స్పీడు బోటు ద్వారా క్షణాల్లో వారిని బయటకు తీసుకురావడం వంటివి చేస్తుంటాడు.మొత్తం మీద సూసైడ్ స్పాట్గా ఉన్న ప్రకాశం బ్యారేజీపై హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు స్పెషల్ ఫోకస్గా మారారు. నిత్యం బ్రిడ్జిపై పహారా కాస్తూ వచ్చిపోయే వారి కళ్లల్లో కళ్ళు పెట్టి చూడడం అలవాటుగా చేసుకున్నారు. ప్రాణాలు కాపాడినవారి కుటుంబ సభ్యుల నుంచి శభాష్ నాగేశ్వరరావు అనే ప్రశంసలు అందుకుంటున్నారు.
Next Story