వీడు కొడుకా? కర్కోటకుడా?
పున్నామ నరకం నుంచి కాపాడే వాడు పుత్రుడంటారు.... కాని... కని పెంచిన తల్లి దండ్రులకు బతికుండగానే నరకం చూపడంతో తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు వృద్ధ దంపతులు..... విజయవాడ కృష్ణలంకలో జరిగిన ఈ ఘటన అందరిని కలిచివేసింది. గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతానికి చెందిన బచ్చు సత్యనారాయణ., కనకదుర్గలకు ముగ్గురు పిల్లలు., గతంలో ఆటోమోబైల్ దుకాణంలో పనిచేసిన సత్యనారాయణ వయసు మీరిన తర్వాత విజయవాడలో స్థిరపడ్డారు. పెద్ద కొడుకు ఒంగోలులో, కుమార్తె., చిన్న కొడుకు విజయవాడలో ఉంటున్నారు. గతంలోనే ఆస్తి పాస్తుల్ని పిల్లలకు పంచి పెట్టిన సత్యనారయణ., ఏడాది క్రితమే విజయవాడలో ఉంటున్న చిన్న కొడుకు దుర్గా ప్రసాద్ వద్దకు వచ్చి ఉంటున్నారు. తల్లిదండ్రులు వచ్చినప్పట్నుంచి వారిని భారంగా భావిస్తున్న చిన్న కొడుకు చీటికి మాటికి విసుక్కోవడం., చీదరించుకోవడం., తన ఇంట్లో ఎంత కాలం ఉంటారని విసుక్కోవడం చేస్తున్నాడు.
హోంగార్గుగా పనిచేస్తున్నా.....
విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎస్బీ హోంగార్డుగా పని చేసే దుర్గా ప్రసాద్ తల్లిదండ్రుల్ని వదిలించుకోవడం కోసం భార్యను పుట్టింటికి పంపేశాడు. దీంతో సత్యనారాయణ తాము ఇచ్చిన డబ్బులో మూడు లక్షలు ఇస్తే విడిగా ఉంటామని కొడుక్కి చెప్పాడు. దీనికి పెద్ద కొడుకు చెన్నకేశవరావు అంగీకరించాడు. దుర్గా ప్రసాద్ మాత్రం డబ్బు ఇచ్చేది లేదంటూ., తన మామ., తోడల్లుడితో కలిసి తల్లిదండ్రులను వేధింపులకు గురి చేశాడు. దీనిపై కృష్ణలంక పోలీసులకు మృతుడు గతంలో ఫిర్యాదు చేయడంతో కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. సోమవారం పెద్ద కొడుకు ఎన్ని సార్లు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో మేనల్లుడిని ఇంటికి పంపాడు. అతను వచ్చి చూసేసరికి ఇంటికి గడి పెట్టి ఉండటంతో స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి చూసేసరికి దంపతులిద్దరు ఉరివేసుకుని కనిపించారు. కన్న బిడ్డ కర్కశత్వం తల్లిదండ్రుల్ని కాటు వేయడం స్థానికుల్ని విషాదంలో నింపింది.