చంద్రబాబుపై జీవీఎల్ సంచలన కామెంట్స్
విభజన హామీలు నెరవేరుస్తున్నా బీజేపీపై తెలుగుదేశం పార్టీ బురదజల్లుతోందని బీజేపీ ఎంపీ జీ.వీ.ఎల్.నరసింహారావు ఆరోపించారు. ఇంతకుముందు హోదా కంటే ఎక్కువే సాధించామని టీడీపీ నేతలే చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తుందని, విపరీతమైన అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. నిధులు దుర్వినియోగం చేస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని, ప్రతీ పైసాకు లెక్క చెప్పాల్సి ఉందని స్పష్టం చేశారు. తెలుగుదేశం ది మహానాడు, కాదని దగానాడు అని అన్నారు. 2,333 కోట్ల సర్దార్ వల్లభాయ్ స్మారక విగ్రహం ఏర్పాటుచేస్తుంటే కేంద్రం కేవలం మూడు వందల కోట్లే ఇస్తుందని, కానీ మూడు వేల కోట్లు ఇస్తున్నట్లు టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. గతంలో మహానాడులో కనీసం ఎన్టీఆర్ ఫోటో లేకుండా చేసిన చంద్రబాబుకు ఓటమి భయం ఉన్నప్పుడల్లా ఎన్టీఆర్ జపం చేస్తారని ఎద్దేవా చేశారు. ఆర్భాటాలు, సినిమా సెట్టింగులు వేయించడం తప్ప టీడీపీకి పరిపాలన చేతకాదన్నారు. గుజరాత్ కి ఇచ్చినట్లే కృష్ణపట్నానికి కేంద్రం నిధులు ఇస్తుందని, గుజరాత్ కు ఎక్కువ ఇవ్వడంలేదని ఆయన అన్నారు.