అలిపిరి ఘటనపై చంద్రబాబు సీరియస్
అలిపిరి టోల్ గేట్ వద్ద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వాహనాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్ షా కాన్వాయ్ లోని వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి ఐదుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ కార్యకర్తలను విడుదల చేయాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అలాగే విధ్వంసానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు పోలీసులను కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా అలిపిరి వద్ద జరిగిన సంఘటనపై చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. ఎవరూ క్రమశిక్షణ తప్పవద్దని హెచ్చరించినా ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని ఆయన నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసనలు తెలియజేయాలే తప్ప ఇలా దాడులకు దిగడం సరికాదని, మరోసారి ఇలాంటివి పునరావృతమయితే చర్యలు తీసుకుంటానని కూడా బాబు హెచ్చరించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.