దాడి రీఎంట్రీ ఆ పార్టీ నుంచే
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగి మంత్రిగా కూడా పనిచేసిన దాడి విరభద్రరావు రాజకీయాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, ఎన్నికలు అయిపోగానే వైసీపీ ఓడిన తర్వాత మొదట ఆ పార్టీని వీడింది ఆయన. అయితే, అంతకుముందు టీడీపీని విడినప్పుడు, తర్వాత వైసీపీని వీడినప్పుడు దాడి ఆయా పార్టీలు, అధినేతలపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఏ పార్టీలో చేరకుండా నాలుగేళ్లుగా సైలెంట్ మోడ్ లో ఉన్నారు.
అయితే, విశాఖపట్నం జిల్లా పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దాడితో భేటీ అయ్యారు. అనకాపల్లిలోని దాడి నివాసంలో ఏర్పాటుచేసిన విందుకు ఆయన హాజరయ్యారు. దీంతో జనసేన పార్టీ నుంచి దాడి వీరభద్రరావు రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. జనసేన పార్టీలోనూ ఇప్పటివరకూ సీనియర్ నేతలు ఎవరూ లేకపోవడంతో దాడి రాక ఆ పార్టీకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది.