హైకోర్టు లో స్వామి పరిపూర్ణానంద పిటిషన్
తనపై విధించిన హైదరాబాద్ నగర బహిష్కరణ ఉత్తర్వులను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ పరిపూర్ణానంద స్వామి హైకోర్టును ఆశ్రయించారు. పరిపూర్ణ నంద తరపున మాజీ అడ్వొకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం తరపున రామచందర్ రావు వాదనలు వినిపిస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్ లో గతంలో స్వామి చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని బహిష్కరించామని ప్రభుత్వ తరపు న్యాయవాది రామచందర్ రావు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో ఎలాంటి కేసులు లేకుండా ఎలా బహిష్కరణ చేస్తారని, ఎప్పుడో ఇచ్చిన ప్రసంగాలపై ఇప్పుడు ఎలా బహిష్కరిస్తారని పిటీషనర్ తరపు న్యాయవాది ప్రకాష్ రెడ్డి వాదించారు. ధర్మాగ్రహ యాత్ర కు మొదటి అనుమతి ఇచ్చి తర్వాత ఎందుకు అనుమతి నిరాకరించారో తెలపాలన్న పిటిషనర్ ఆర్టికల్ 19 ప్రకారం భారత దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉంటుందని కోర్టుకు తెలిపారు. స్వామి పరిపూర్ణానంద పై వేసిన నగర బహిష్కరణ ఎత్తి వేయాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.