చంద్రబాబూ... ఇప్పటికైనా మారవా..?
ప్రజలు స్వచ్చందంగా బంద్ లో పాల్గొంటుంటే బంద్ ను విఫలం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయని కుట్ర లేదని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా బంద్ ను విజయవంతం చేసిన ప్రజలకు, ప్రజా సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అన్ని జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారని, బంద్ ను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు 144 సెక్షన్ కూడా అమలు చేశారని ఆరోపించారు. ఒక్కో జిల్లాలో 300 మంది నుంచి 1500 మంది వరకు వైసీపీ నేతలను అరెస్ట్ చేశారన్నారు. నంద్యాలలో డీఎస్పీ గోపాలకృష్ణ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారన్నారు. చంద్రబాబు స్వంత నియోజకవర్గం కుప్పంలోనూ ప్రజలు స్వచ్చందంగా బంద్ లో పాల్గొన్నారని, ప్రత్యేక హోదా నినాదం చేసినా చంద్రబాబుకు వినపడటం లేదన్నారు. తన ఎంపీల చేత రాజీనామా చేయించి...దేశం మొత్తం మన వైపు చూసేలా చేసి...స్వయంగా బంద్ లో పాల్గొనాల్సిన చంద్రబాబు బంద్ ను విఫలం చేయాలని చూశారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు మోసం వల్లే...
చంద్రబాబు ఒప్పుకున్నందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, ఆయన వల్లే ప్రత్యేక హోదా ఇవ్వలేదని కేంద్రం చెబుతుందని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు, చెబుతున్న అబద్దాలు తారస్థాయికి చేరాయని ప్రజలు కచ్చితంగా ఆయనను శిక్షిస్తారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను దగ్గరుండి బాబు రానివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం ఆయన చిత్తశుద్ధితో ముందుకురావాలని కోరారు. లేకపోతే భవిష్యత్ తరాలు ఆయనను చరిత్రహీనుడిగా చూస్తాయనన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు పిలుపునిచ్చినా తాము మనస్ఫూర్తి అందరి కంటే ముందు రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, రాజకీయ స్వార్థం కోసం బంద్ కు మద్దతు ఇవ్వని వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. స్వతంత్రానికి ముందు చంద్రబాబు లేకపోవడం దేశం చేసుకున్న అదృష్టమని, ఆయన ఉండి ఉంటే బ్రిటీష్ వారు ఇచ్చే ప్యాకేజీ సరిపోతుందని, స్వతంత్రం వద్దని చెప్పేవారని ఎద్దేవా చేశారు.