జగన్ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ సీరియస్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ సోదరుడు నాగబాబు స్పందించారు. ఒక పార్టీ అధినేత ఎప్పుడూ మాట జారవద్దని, జగన్ మాట్లాడిన మాటలు పార్టీ అధ్యక్షుడిగా ఆయన స్థాయికి తగినవి కావని పేర్కొన్నారు. దీనివెనుక రాజకీయ అజెండా ఉందని, రాజకీయంగా విమర్శలు చేసే అవకాశం లేకే వ్యక్తిగతంగా విమర్శించారన్నారు. పవన్ ఎవరినీ మోసం చేసి పెళ్లి చేసుకోలేదని, న్యాయపరంగానే విడాకులు తీసుకున్నారని స్పష్టం చేశారు. భార్యాభర్తల మధ్య జరిగిన విషయాలు అనవసరమని పేర్కొన్నారు. న్యాయంగా బతుకుతున్న వ్యక్తిపై ఇలాంటి నిందలు ఎందుకు మోపుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పవన్ ను టీడీపీ, వైసీపీ తక్కువ అంచనా వేశాయని, ఇప్పుడు ఏపీలో పవన్ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగుతున్నారని అభిప్రాయపడ్డారు. అభద్రతాభావంతోనే పవన్ పై జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.