Sat Apr 27 2024 17:01:07 GMT+0000 (Coordinated Universal Time)
ఆ 11 రోజులు నవ్వొద్దు.. ఏడ్వొద్దు.. కిమ్ నయా రూల్
ఉత్తరకొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ మరణించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆంక్షలు విధించారు
ఉత్తరకొరియాలో ఆ దేశ అధ్యక్షుడైన కిమ్ పరిపాలన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకూ కిమ్ జాంగ్ నియంత చేష్టలతో దేశ పాలన పరాకాష్టకు చేరుతోంది. తాజాగా ఆదేశ ప్రజలకు మరికొన్ని వింతకష్టాలు వచ్చి పడ్డాయి. ఆ దేశ ప్రజల వస్త్రధారణ, హెయిల్ స్టైల్.. ఇలా వారి జీవన విధానమంతా దేశాధినేత ఇష్టాయిష్టాలతోనే ఉండాలి. ఇప్పుడు దేశంలో ప్రజలెవ్వరూ నవ్వకూడదు, మద్యం తాగకూడదు.. పార్టీలు కూడా చేసుకోకూడదంటూ.. కొత్త ఆంక్షలు విధించింది కింగ్ ప్రభుత్వం.
కారణం ఏమిటంటే..?
ఉత్తరకొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ మరణించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూ ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో దేశంలో సంతాప దినాలుగా పాటించే ఆ 11 రోజులు ప్రజలెవ్వరు నవ్వకూడదని..మద్యం సేవించి ఖుషీగా ఉండకూడదని కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ జాంగ్ కు ప్రజలంత 11 రోజుల సంతాప దినాలు పాటించాల్సిందిగా ఆర్డర్ పాస్ చేశాడు. ఈ 11 రోజులు ప్రజలు కనీసం నవ్వినా..ఆల్కహాల్ సేవించినా..కఠిన శిక్షలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ ఆంక్షలు ఎంతగా ఉన్నాయంటే..దేశంలో ఎవ్వరు సంతోషకరమైన కార్యక్రమాలు చేసుకోకూడదు. పిల్లలు పుట్టిన రోజులు కూడా చేసుకోకూడదని నిబంధనలు విధించారు.
నిత్యావసర వస్తువులు కూడా....
అంతే కాకుండా డిసెంబర్ 17న కిమ్ జాంగ్ 10వ వర్థంతి సందర్భంగా ఉత్తర కొరియా వాసులు ఎవ్వరూ ఆ రోజున నిత్యవసర వస్తువులు కూడా కొనుక్కోకూడదని కిమ్ జాంగ్ రూల్ పాస్ చేశాడు. అక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే. ఈ 11 రోజుల సంతాప దినాల సమయంలో ఎవరి ఇంట్లోనైనా మరణం సంభవిస్తే ఏడవకూడదు.. అలాగే ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఒకటా .. రెండా.. చాలానే రూల్స్ పెట్టాడంట కిమ్. కిమ్ జాంగ్ ప్రభుత్వం పాస్ చేసిన ఈ రూల్స్ ను ఎవరు అతిక్రమించినా వారికి కఠిన శిక్షలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Next Story