నైరాశ్యంలో రాహుల్
కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని నైరాశ్యంలోకి నెట్టాయి. కాంగ్రెస్ విజయం కోసం కర్ణాటకలో సుమారు 38 ప్రచార ర్యాలీల్లో రాహుల్ పాల్గొన్నారు. కన్నడ నాట ఉన్న అనేక ఆలయాలు, మఠాలు తిరిగారు. ఆయన ప్రచారం కార్యక్రమాలకు కూడా ప్రజల స్పందన బాగానే వచ్చింది. కాగా, కర్ణాటకలో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని, అధికారం తిరిగి కైవసం చేసుకోవడం ఖాయమని రాహుల్ ఇప్పటివరకు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కానీ, ఫలితాలు అందుకు విరుద్ధంగా రావడంతో ఆయన నైరాశ్యంలో పడిపోయారు. ఉదయం నుంచి ఆయన ఎక్కడా బయటకు రాలేదు. జేడీఎస్ తో చర్చలు జరపడానికి కూడా సోనియా గాంధీ ముందుకువచ్చి దేవెగౌడకు ఫోన్ చేసినా రాహుల్ మాత్రం స్పందించలేదు. గతంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పుడు రాహుల్ మీడియాతో మాట్లాడి హుందాగా ఓటమిని అంగీకరించారు. కానీ, ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తాను చాలా ఆశలు పెట్టుకున్న కర్ణాటక హస్తానికి హ్యండ్ ఇవ్వడంతో ఆయన ఇప్పట్లో తేరుకునేటట్లు కనపడటం లేదు.