టీఆర్ఎస్ మేనిఫెస్టో ఇదే...
రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలవాలని పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ భారీ హామీలతో పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించింది. మంగళవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశమై మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చారు. ఇప్పటివరకు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో మరిన్ని అంశాలతో మేనిఫెస్టోకు తుదిరూపు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేవలం ఓట్ల కోసం కాకుండా ఒక బాధ్యతతో టీఆర్ఎస్ మేనిఫెస్టో తయారుచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికలంటే ఇతర పార్టీల వారికి పోలిటికల్ గేమ్ అని, తమకు మాత్రం ఒక నిర్ధిష్టమైన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు చెప్పినవాటిని అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉంటుందన్నారు. తెలంగాణ సాధించిన పార్టీగా, తెలంగాణను పాలించిన పార్టీగా రాష్ట్ర పరిస్థితులపై, బడ్జెట్ పై తమకు పూర్తి అవగాహన ఉందని, ఆ అవగాహనతోనే మేనిఫెస్టో రూపొందిస్తున్నామన్నారు. ఈ ఐదేళ్లలో తెలంగాణకు కేంద్రం అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. కేంద్రం అదనంగా ఏ నిధులూ ఇవ్వకున్నా ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు ఐదేళ్లలో వస్తాయన్నారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రం తిరిగి చెల్లించాల్సింది రూ.2 లక్షల 35 వేల కోట్లు ఉంటుందన్నారు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉంటే సంవత్సరానికి 20-30 వేల కోట్లు అదనంగా నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు...
- రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న వారు 45.5 లక్షల మంది ఉన్నారు. రూ. 1 లక్ష లోపు రుణం తీసుకున్న వారు 42 లక్షల మంది ఉన్నారు. రూ.1 లక్ష లోపు రైతుల వ్యవసాయ రుణమాఫి చేస్తాం. గతంలో వచ్చిన సమస్యలు రాకుండా ఒకటి రెండు ఇన్ స్టాల్మెంట్ల ద్వారానే రుణమాఫీ చేసేస్తాం.
- రైతుబంధు పథకం ద్వారా వ్యవసాయ పెట్టుబడిని ఎకరానికి రూ.10 వేలకు పంచుతాం.
- ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మహిళా సంఘాలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఏర్పాటు చేయించి పంటకు కనీస మద్దతు ధర దక్కేలా చూస్తాం. రైతు సమన్వయ సమితిలకు గౌరవ వేతనం ఇస్తాం.
- సుమారు 40 లక్షల మందికి ప్రస్తుతం పింఛన్లు ఇస్తున్నాం. ఆసరా పింఛన్ల వయో పరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తాం. దీంతో మరో 8 లక్షల మంది అదనంగా లబ్ధి పొందుతారు. ప్రస్తుతం రూ.1000 ఉన్న వృద్ధాప్య పింఛన్లను రూ.2,016కి పెంచుతాం. వికలాంగులకు 1500 ఉన్న పింఛను రూ.3,016కి పెంచుతాం.
- ప్రభుత్వం ఏర్పడ్డాక నిరుద్యోగ భృతికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తాం. ప్రతీ నిరుద్యోగికి రూ.3,016 నిరుద్యోగ భృతి అందిస్తాం. ప్రభుత్వం ఏర్పడ్డాక 3-4 నెలల్లో నిరుద్యోగ భృతి అందిస్తాం.
- రాష్ట్రంలో ఇంకా ఎనిమిదిన్నర లక్షల ఇళ్లు కట్టిస్తే రాష్ట్రంలో ఇళ్లు లేని వారు ఉండరు అనే అంచనాలు ఉన్నాయి. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటామనే వారికి కూడా ఇళ్లు కట్టిస్తాం. కొందరు ప్రభుత్వ సహకారంతో వారు కొంత డబ్బు కలుపుకుని ఇళ్లు కట్టుకుంటామని అంటున్నారు. వారికి కూడా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కూడా కొనసాగిస్తాం.
- దళితులకు 10-15 వేల కోట్లతో, గిరిజనులకు 6 - 10 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటుచేస్తాం.
- రెడ్డిలు, వైశ్యులు వంటి అగ్రవర్ణ పేదలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. మేధావులతో చర్చించి విధి విధానాలను నిర్ణయిస్తాం.
- దేశంలోనే ఎక్కడా లేని విధంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు, హోంగార్డులకు తెలంగాణలోనే ఎక్కువ వేతనాలు ఇస్తున్నాం. మళ్లీ అధికారంలోకి వస్తే వీరందరికీ మరింత మేలు చేస్తాం.