అమరావతి రోడ్లు ఎలా ఉండబోతున్నాయంటే...
ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఏపీ రాజధాని అమరావతి ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. అయితే ఈ నగరంలో కీలక ఇన్ ఫ్రా రంగ నిర్మాణాలకు ఇప్పుడు కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు అమరావతి నగర నిర్మాణంపై బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రధానంగా నగరంలో రోడ్ల స్వరూపం ఎలా ఉండబోతున్నదో చర్చకు వచ్చింది. అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనల్ని విని, చంద్రబాబునాయుడు తాను కొన్ని సూచనలు చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో రోడ్ క్రాస్ సెక్షన్ ఆకృతులపై సమావేశంలో అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. విద్యుత్, ఇతర అవసరాలకు ఉపయోగించే డక్ట్స్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల్సివున్నదని చెప్పారు.
రాజధానిలోని ప్రతి గృహంలో సగభాగం అన్పేవ్డ్ ఏరియాగా వుంటుందని తెలిపారు. వర్షం నీరు, వరద నీరు భూమిలోకి నేరుగా ఇంకిపోయే ఏర్పాటు వుండి తీరాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టంచేశారు. ఏ నిర్మాణాలకైనా అట్టడుగు భాగాన భూగర్భంలో నీరు ఇంకి రీఛార్జ్ అయ్యేందుకు వీలుగా, లేదా నీరు రిజర్వాయర్కు చేరుకునేలా ప్రత్యేక ఏర్పాటు వుండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో లక్షా 50 వేల పంటకుంటల తవ్వకాలతో నీటి సంరక్షణ చర్యలు తీసుకున్నామని, నగర, పట్టణ ప్రాంతాలలో సైతం ఈ తరహా ఏర్పాట్లు చేసుకోకపోతే భవిష్యత్తులో నీటికి వెతలు తప్పవని హెచ్చరించారు. స్మార్మ్ సిటీలంటే ఇటువంటి ముందుజాగ్రత్తలు తీసుకునే విధానాలతో రూపొందించేవేనని అన్నారు.
వాటర్, సీవరేజ్ కోసం వెట్ల్యాండ్ ట్రీట్మెంట్ విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచించారని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. పైకి గ్రీనరీతో ఆకర్షణీయంగా కనిపించేలా లోపల వాటర్ ట్రీట్మెంట్ జరిగే మోడల్ను పరిశీలిస్తున్నామని తెలిపారు.
రహదారుల విషయంలో బ్లాక్ టాప్ రోడ్ల కంటే వైట్ టాప్ రోడ్ల నిర్మాణానికే నిపుణులు మొగ్గు చూపారని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ముఖ్యమంత్రికి వివరించారు. బ్లాక్ టాప్ రహదారులతో పోల్చితే 15 శాతం వ్యయం అధికంగా వున్నా వైట్ టాప్ రోడ్లు ఉష్ణోగ్రతను చాలావరకు తగ్గిస్తాయని అన్నారు. పైగా నిర్వహణ వ్యయం కూడా తక్కువేనని తెలిపారు. వైట్ టాప్ రోడ్లకు సంబంధించి నవీన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.
నివాస ప్రాంతాలలో ప్రతి వంద మీటర్ల దూరానికి ఒక క్రాసింగ్ వుండాలని నిపుణులు సూచించారని, ఆ సూచనలకు అనుగుణంగా రహదారి నిర్మాణాలు వుండేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. సైకిలిస్టులు, పాదచారుల కోసం ప్రత్యేకంగా గ్రీన్ బెల్ట్ మార్గం వుంటుందని వివరించారు. ఈ గ్రీన్ బెల్ట్ రహదారికి ప్రతి వంద మీటర్లకు ఒక క్రాసింగ్ వుండేలా రూపకల్పన చేస్తున్నామని చెప్పారు.
రోడ్ల నిర్మాణం , ప్రాథమికంగా దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఒక కొలిక్కి వచ్చినట్లయితే.. ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పరంగా ఏర్పాట్లు ముమ్మరం అవుతాయని, ఆ వెంటనే ఒక్కొక్కటిగా భవనాల నిర్మాణం కూడా మొదలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.