Tue May 07 2024 16:08:01 GMT+0000 (Coordinated Universal Time)
అప్పలరాజుకు కోపమొచ్చింది.. జగన్ పర్యటనలో పాల్గొనకుండానే?
ఆంధ్రప్రదేశ్ మంత్రి అప్పలరాజుకు విశాఖ శారదపీఠం వద్ద అవమానం జరిగింది. ఆయన అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి అప్పలరాజుకు విశాఖ శారదపీఠం వద్ద అవమానం జరిగింది. ఆయన అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి అప్పలరాజు కూడా అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. విశాఖలోని శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్ వచ్చారు. జగన్ వచ్చే ముందు మంత్రి అప్పలరాజు తన అనుచరులతో శారదాపీఠం వద్దకు చేరుకున్నారు. అయితే మంత్రిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని, మరెవ్వరికీ అనుమతి లేదని పోలీసులు చెప్పారు.
అనుచరులను....
తనతో పాటు నలుగురు మాత్రమే లోపలకి వస్తారని మంత్రి అప్పలరాజు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే మంత్రికి మాత్రమే అనుమతి ఉందని మరెవ్వరికీ అనుమతి లేదని అక్కడ సీఐ తేల్చి చెప్పారు. ఈ సందర్బంగా మంత్రికి, సీఐకి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. పోలీసులకు మంత్రి ఎంత నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
సీఐ క్షమాపణ చెప్పాలంటూ....
దీంతో మంత్రి సీదిరి అప్పలరాజు శారదాపీఠం లోకి వెళ్లకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. పోలీసులకు నమస్కరించి మరీ వెనుదిరిగి మంత్రి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. తమకు ఉన్న ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని, మంత్రికి తప్ప మరెవ్వరికీ అనుమతి లేదని చెప్పినా విన్పించుకోకుండా వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు. తనను అడ్డుకున్న సీఐ క్షమాపణలు చెప్పాలని అప్పలరాజు డిమాండ్ చేశారు. తాను క్షమాపణ చెప్పబోనని సీఐ చెప్పడంతో అక్కడి నుంచి అప్పలరాజు వెళ్లిపోయారు.
Next Story