Sat Apr 27 2024 09:58:24 GMT+0000 (Coordinated Universal Time)
ఇలాంటి వాళ్ల సలహాలు, సూచనలు అవసరం లేదు: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మీద పలువురు కాపు నేతలు విమర్శలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మీద పలువురు కాపు నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తీరు సరిగా లేదని.. అంత తక్కువ సీట్లు తీసుకోవడం కరెక్ట్ కాదని విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కు సూచనలు ఇచ్చిన పలువురు నేతలు ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారు. దీనిపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. మొన్నటి వరకు కొందరు తనకు సలహాలు ఇచ్చారని.. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిపోయారని అన్నారు. అవసరాల మేరకు మాట్లాడే వ్యక్తులు తనకు అవసరం లేదని.. సీట్లు ఎన్ని తీసుకోవాలి, రాజకీయాలు ఎలా చేయాలి అనే విషయంపై ఇలాంటి వాళ్ల సలహాలు, సూచనలు తనకు అవసరం లేదన్నారు. కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్యలపైనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ సమక్షంలో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి తనకు శ్రీనివాస్ తెలుసని.. తనతో కలిసి ప్రయాణిస్తానని శ్రీనివాస్ చెప్పారన్నారు. చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాయలసీమలో ఏమీ మిగలదని.. ఇక్కడ నుండి ఎంతో మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిపోతున్నారని అన్నారు. తెలుగు జాతిని నా కుటుంబం అనుకున్నాను. చిన్న కులాల్లో ఐక్యత లేకపోవడం వల్లే జగన్ కు ఊడిగం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.
Next Story