Thu May 02 2024 17:14:31 GMT+0000 (Coordinated Universal Time)
కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం.. మూడు బస్సులు దగ్ధం
సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోదాం, నూతన సచివాలయం, రామంతాపూర్ లలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలు..
హైదరాబాద్ లో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోదాం, నూతన సచివాలయం, రామంతాపూర్ లలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలు మరువకముందే.. తాజాగా కూకట్ పల్లిలోని పార్క్ షేడ్స్ లో అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదం కలకలం రేపింది. పార్కట్ షెడ్స్ లో పార్కింగ్ చేసి ఉన్న బస్సులు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. తొలుత ఒక బస్సులో మంటలు చెలరేగగా.. అవి క్రమంగా పక్కనున్న మరో రెండు బస్సులకు వ్యాపించాయి. మొత్తం మూడు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో మూడు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ బస్సులు భారతీ ట్రావెల్స్ కు చెందినవిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది ? బస్సులో మంటలెలా చెలరేగాయి ? ఇది ఎవరైనా కావాలని చేశారా ? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story