Wed May 01 2024 16:56:34 GMT+0000 (Coordinated Universal Time)
దేవాలయాల్లో చోరీల ముఠా అరెస్ట్
దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నెల్లూరు జిల్లా ఉదయగిరి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు
దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నెల్లూరు జిల్లా ఉదయగిరి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో మొత్తం ఆరుగురు సభ్యులుండగా.. వారి వద్ద నుంచి శ్రీదేవి, భూదేవి, అచ్యుత స్వామివారి విగ్రహాలతో పాటు రూ.2,10,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో సుమారు 10 ఆలయాల్లో ఈ ముఠా దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
నగదుతో పాటు...
చోరీల్లో మొత్తం రెండు లక్షల 10 వేలను దొంగిలించారని, ఆయా ఆలయాల్లో దొంగతనానికి గురైన సొమ్మును తిరిగి అప్పజెప్తామని పేర్కొన్నారు. కాగా.. ఈ ముఠా చోరీలకు వాడిన ఆటో, ఇతర సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. ఇటీవల జరిగిన దేవాలయం చోరీలో లభించిన ఆధారాలతో 14 రోజుల్లోనే కేసు దర్యాప్తు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులను పలువురు అభినందించారు.
Next Story