ఈ గండం నుంచి బయటపడేదెలా?
భారత దేశ రాజ్యాంగం ఫెడరల్ స్ఫూర్తికి పట్టం కడుతోంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య స్పష్టమైన విభజన చేసింది. ఈ రెండు పరస్పర సమన్వయంతో, సహకార స్ఫూర్తితో పనిచేయాలని నిర్దేశించింది. కేంద్రం పెద్దన్న కానేకాదు. అదే సమయంలో రాష్ట్రాలు, కేంద్రం సామంత రాజ్యాలు కావు. కేంద్రం దయాదాక్షిణ్యాలపై అవి ఎంత మాత్రం ఆధారపడి లేవు. అయినప్పటికీ అనేక విషయాల్లో కేంద్రం పెత్తనమే కొనసాగుతోంది. కేంద్రంలో సంపూర్ణ బలంగల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఒకింత ఎక్కువగ. అదే సమయంలో కేంద్రంలో, రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు, రాజకీయంగా వాటి మధ్య విభేదాలు ఉన్నప్పుడు గందరగోళం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై ధ్వజమెత్తుతున్నాయి. నిధుల పంపకంలో కేంద్రం వివక్ష పాటిస్తోందని దక్షిణాది రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. పార్టీలకు అతీతంగా ప్రతి దక్షిణాది రాష్ట్రం ఈ విషయంలో బహిరంగ విమర్శ చేస్తోంది. తాజాగా నిదుల పంపకానికి సంబంధించి చర్చించేందుకు సమావేశమై కేంద్రంపై పోరాటానికి కార్యాచరణ తయారు చేయాలని నిర్ణయించాయి. కేరళ ఆర్థిక మంత్రి ధామస్ ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. వచ్చేనెల 10వ తేదీన తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేశారు.
నిధులను ఉత్తరాదికి మళ్లిస్తున్నారంటూ....
అభివృద్ధి, అవసరాల పేరుతో దక్షిణాది రాష్ట్రాల ఆదాయాన్ని ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. రాష్ట్రాలకు నిధుల పంపిణీకి సంబంధించి 1971 జనాభా లెక్కలకు బదులు 2011 లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని 15 ఆర్థిక సంఘానికి కేంద్రం నిర్దేశించింది. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ఆగ్రహంతో ఉన్నాయి. జనాభా నియంత్రణను పాటించి అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర నిర్ణయం పెను విఘాతం కలిగించేదిగా ఉంది. ఇది ద్రవ్యలోటు, ఇతర అంశాలపై ప్రభావం చూపుతుంది. ద్రవ్య వినిమయ చట్టం ప్రకారం మూడు శాతం వరకూ రుణాలు తీసుకునే అవకాశం ఉండగా దానిని రెండున్నర శాతానికి తగ్గించారు. జి.ఎస్.డి.పి. (గ్రాస్ స్టేట్ డొమస్టిక్ ప్రోడక్ట్) లో 25 శాతానికి తగ్గించడం వంటి సిఫార్సులు రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తాయి. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కలిగించిన వెసులుబాట్లను 15వ ఆర్థిక సంఘం వెనక్కు తీసుకునే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రాల హక్కులను, అధికారాలను గుణించే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానాలూ లేకపోలేదు.
కేంద్ర విధానాలను తిప్పికొట్టాలని....
ఈ నేపథ్యంలో కేంద్ర విధానాలను గట్టిగా వ్యతిరేకించాలని దక్షిణాది రాష్ట్రాలు నిర్ణయించాయి. కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేయడం ద్వారా, జనాభా పెరుగుదలను నియంత్రించి, అభివృద్ధి సాధించడమే దక్షిణాది రాష్ట్రాలు చేసిన పాపమా? అని కేరళ ఆర్థిక మంత్రి ధామస్ ఇస్సాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఆయనకు జత కలిశారు. కేంద్రానికి వచ్చే పన్నుల్లో 9.56 శాతం ఒక్క కర్ణాటక నుంచే వస్తున్నాయి. అందులో కేవలం 4.5 శాతం మాత్రమే తిరిగి రాష్ట్రానికి వస్తుందని సిద్ధరామయ్య పేర్కొంటున్నారు. భౌగోళికంగా, విద్య, ఆరోగ్య తదితర అంశాల్లో దక్షిణాది రాష్ట్రాల మధ్య సారూప్యత ఉంది. అందువల్ల పరస్పర అభిప్రాయాలను పంచుకుని ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయించాయి. కేరళ ఈవిషయంలో చొరవ తీసుకుంది.
ఆరు రాష్ట్రాలూ కలసి నడుస్తాయా?
పన్నుల పంపకంతో పాటు రాజకీయంగా గల విభేదాలు కూడా ఈ పరిస్థితికి దారితీశాయని చెప్పడం సత్యదూరం కాదు. ప్రస్తుతం ఆరు దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విభేదిస్తున్నాయి. కేరళను పాలిస్తున్న సీపీఎం, బీజేపీ మధ్య సిద్ధాంతపరమైన వైరుద్థ్యం ఉంది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి మొదటి నుంచీ నెలకొంది. ఇటీవల త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఓటమితో పరిస్థితి మరింత ముదిరింది. కర్ణాటకలో కాంగ్రెస్ చక్రం తిప్పుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య వైరం ఈనాటిది కాదు. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు పార్టీలూ కత్తులు దూస్తున్నాయి. అధికారాన్ని కాపాడుకునేందుకు ఒకరు, ఒడిసిపట్టుకునేందుకు మరొకరు పోటీ పడుతున్నందున పోరు ఆసక్తికరంగా మారింది. నిన్నమొన్నటి దాకా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వం పోరాడుతోంది. ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పుదుచ్చేరి ప్రబుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంకా మౌనాన్ని వీడలేదు. రెండు జాతీయ పార్టీలకు వ్యతరేకంగా ఫెడరల్ ఫ్రంట్ కు రూపకల్పన చేస్తానన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం కూడా దూరంగా ఉండే అవకాశం కనపడుతోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే రాజకీయంగా బీజేపీతో కలిసి నడుస్తోంది. ఆ పార్టీ నాయకుడు తంబిదురై లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మొత్తం మీద వనరుల పంపిణీ విందు రాజకీయంగా బీజేపీని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. దక్షిణాదిన పట్టుకోసం పరితపిస్తున్న కమలనాధులకు ఇది కష్టకాలమే...!!
-ఎడిటోరియల్ డెస్క్