కమలానికో నేస్తుడు కావాలి...!
‘అంతా మా ఇష్టం. మేం చెప్పిందే జరగాలి. చేసినదానికి తల ఊపాలి.సొంతపార్టీ పెద్దలైనా, మిత్రపక్షాల అధినేతలైనా అంతే. రూల్ ఈజ్ రూల్. రూల్ ఫర్ ఆల్.’ గడచిన రెండేళ్లుగా కేంద్రంలోని మోడీ, అమిత్ షాల ఇష్టా రాజ్యం ఇలా సాగిపోతోంది. కానీ హఠాత్తుగా మనసు మారింది. మాట మారింది. అబ్బే మిత్రపక్షాలంటే మాకెంతో గౌరవం. మేమే స్వయంగా వారి తో మాట్టాడతాం. మీ సమస్యలు మావే. మీ అధినేతతో సమావేశమవుతాం. సంప్రతింపులతో సానుకూలంగా పరిష్కరిస్తామంటూ ప్రధాని తెలుగుదేశం ఎంపీలకు హామీ ఇచ్చారు. వారంతా ఉబ్బితబ్బిబ్బయ్యారు. అసలు తమతో మాట్టాడటమే గొప్ప అనుకుంటే మీ సీఎంతో సమావేశమవుతామంటూ హామీ ఇవ్వడంతో వారి ఆనందానికి పట్టపగ్గాలేకుండా పోయాయి. కానీ అందులోని రాజకీయ కోణం మాత్రం వారికి అంతుపట్టలేదు. దాదాపు ఏడాది కాలంగా ప్రధానితో ప్రత్యేక భేటీ కోసం ఎన్నిసార్లు కోరినా చంద్రబాబును దూరంగా పెట్టిన మోడీ ఇప్పుడు తనంతతానే ముందుకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. దీంట్లోని పొలిటికల్ కాంటెక్స్ట్ పై రకరకాల కోణాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి.
ప్యాచ్ అప్ ..ప్రధాని అవసరమే...
నియంతృత్వ ధోరణితో మిత్రపక్షాల సహా ప్రాంతీయ పార్టీలకు పూచికపుల్లపాటి విలువ ఇవ్వడం లేదు నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం. తాము విపక్షంలో ఉన్నామో లేదా మిత్రులుగా ఉన్నామో అర్థం కాని పరిస్థితి ఎన్డీఏ భాగస్వాములది. జేడీయూ, తెలుగుదేశం, శివసేన, శిరోమణి అకాలీదళ్ వంటివి ఎన్డీఏ లో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలు. బీజేపీ ధోరణిపై ఈ పక్షాల్లో ఒక్కటి కూడా సంతృప్తిగా లేదు. శివసేన బహిరంగంగానే తన అసంతృప్తిని , ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అకాలీదళ్ పైకి చెప్పలేకపోయినా లోలోపల కుతకుతలాడిపోతోంది. నితీశ్ కు, మోడీకి ఈ మధ్యనే రాజీ కుదరడంతో ఇంకా జేడీయూ బీజేపీపై ధ్వజమెత్తే స్థాయికి చేరలేదు. తెలుగుదేశం పార్టీకి సారథ్యం వహిస్తున్న చంద్రబాబు మిత్రపక్షాల్లో సీనియర్ నేత . వాజపేయి సమయంలో ఆయన చెప్పింది వేదంలా చెల్లుబాటయ్యింది. అంతకుముందే యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా పనిచేసి అన్నిపక్షాలను ఏకతాటిపై నడిపిన అనుభవం చంద్రబాబుకుంది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు జాతీయ స్థాయి నేతగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఎన్డీఏ లో భాగమయినప్పటికీ వాజపేయి కాలం నాటి గుర్తింపు కరవైంది. చంద్రబాబు హవా పురావైభవంగానే మిగిలిపోయింది. కేంద్రం ముందు చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవమానాలు ఎదురవుతున్నప్పటికీ బాబు సర్దుకుపోయే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రం అవసరాలు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఏ అనుమతులు కావాలన్నా, విదేశీ సాయం పొందాలన్నా, రుణాలు తెచ్చుకోవాలన్నా కేంద్రంపై ఆధారపడాల్సిందే. దాంతో ఎన్డీఏ లో ద్వితీయ శ్రేణి ప్రాధాన్యంతో సరిపుచ్చుకుంటూ కాలం వెళ్లదీస్తోంది టీడీపీ. తాజాగా ఏర్పడిన రాజకీయ పరిణామాలతో ప్రధానికే తెలుగు దేశం అవసరం ఏర్పడింది. చంద్రబాబు లాంటి వ్యూహకర్త, సంధానకర్త, ఘటనాఘటన సమర్థుడు ఎన్డీఏ కి నేటి అవసరం. అందుకే పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పీఎంఓ కార్యాలయమే చంద్రబాబు కార్యాలయాన్ని సంప్రతించి ప్రధానితో సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించింది. ముఖ్యమంత్రి షెడ్యూలును అనుసరించి ప్రధాని భేటీని ఖరారు చేస్తామంది. ఇదే ఇప్పుడు టీడీపీలో చర్చకు దారితీస్తోంది.
టైమ్ చూసి ఝలక్...
ఇన్నాళ్లుగా తమను కించపరుస్తూ చిన్నచూపు చూస్తున్న బీజేపీని తెలుగుదేశం పార్టీ టైమ్ చూసి కొట్టింది. ముస్లిం మహిళా వైవాహిక హక్కుల పరిరక్షణ (ట్రిపుల్ తలాక్) బిల్లు సందర్భంగా విపక్ష వాణికి జై కొట్టింది. ప్రధానికి, కేంద్రానికి దిమ్మతిరిగే షాకిచ్చింది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ స్వతంత్ర వైఖరిని తీసుకుంది. దీంతో ప్రధానికి వాస్తవం బోధ పడింది. ఒకవైపు కాంగ్రెసు దేశంలో బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణాదిన చేతులు కలిపి నడుస్తున్న ఏకైక మిత్రపక్షం తెలుగుదేశమే. ముస్లిం ఓట్ల ప్రాబల్యం కారణంగా టీఆర్ఎస్ బీజేపీతో బహిరంగంగా కలిసే సూచనలు లేవు. తమిళనాడులో వేసిన ఎత్తుగడలు వికటించాయి. రజనీకాంత్, ఏఐఏడీఎంకే బీజేపీతో 2019లో కలిసేందుకు సాహసించని పరిస్థితి. కర్ణాటకలో నెగ్గుతారో లేదో గ్యారంటీ లేదు. కేరళ సంగతి సరేసరి. అందువల్ల దక్షిణాదిన ఉన్న ఏకైక మిత్రపక్షాన్ని దూరం చేసుకుంటే భవిష్యత్తులో అవసరమైన సమయంలో ఆదుకునేవారు లేకుండా పోతారనే నిజం తలకెక్కింది. అందులోనూ ఇంకా రాజ్యసభలో సంపూర్ణమైన ఆధిక్యం సాధించని స్థితిలో బిల్లులు గట్టెక్కాలంటే టీడీపీ వంటి మిత్రుల అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మిత్రపక్షాల్లోని విభేదాలు రచ్చకెక్కితే వాటిని తనకు అనుకూలంగా మలచుకునేందుకు కాంగ్రెసు కాచుకు కూర్చుంది. ఆంధ్రప్రదేశ్ లో తనకెలాగూ స్థానం లేదు. తెలంగాణ వంటి చోట్ల టీడీపీ వంటి పార్టీలు కలిసొస్తే పొత్తులు కుదుర్చుకునేందుకు కూడా కాంగ్రెసు పార్టీకి అభ్యంతరం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసు పార్టీ. టీడీపీ కనుక స్నేహహస్తం అందిస్తే కాంగ్రెసుకు ఆసరా దొరికితే నష్టపోయేది బీజేపీనే. గుజరాత్ ఎన్నికల తర్వాత తన బలహీనతలు కూడా ప్రధానికి తెలిసొచ్చాయి.అందువల్ల వ్యూహ నైపుణ్యం కలిగిన చంద్రబాబు వంటివారి అలక తీర్చడము తప్పని సరి అవసరంగా గుర్తించారు. నిజానికి చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పటికీ ఆయనను పెద్దగా పట్టించుకునే వారే కరవయ్యారు. ప్రధానితో భేటీ తర్వాత ఆ హోదాకు కూడా ప్రాధాన్యం దక్కే అవకాశం కనిపిస్తోంది. రజనీకాంత్ సహా అనేకమంది ప్రముఖులు, ముఖ్యమంత్రులు, ప్రాంతీయ నాయకులతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయి. 2019లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావడానికి పొత్తులు, ఎత్తుల్లో చంద్రబాబు చాణక్యాన్ని కూడా వాడేసుకోవాలని నరేంద్రమోడీ నిర్ణయించేసుకున్నట్లే. రాజకీయ కారణాలు ఎలా ఉన్నప్పటికీ చంద్రబాబు, మోడీ సన్నిహితమైతే ఆంధ్రప్రదేశ్ కు తప్పనిసరిగా ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది.
-ఎడిటోరియల్ డెస్క్