బాబాయికి భారం.. విజయసాయికి వరం
అన్న వస్తున్నాడంటూ కదిలిన జగన్ జన సంకల్పయాత్ర ఒకవైపు క్యాడర్ లో ఉత్సాహం నింపుతుంటే మరోవైపు అగ్రనాయకత్వ సమీకరణలను పునర్వ్యవస్థీకరిస్తోంది. పార్టీ నిర్ణయాలు , విధానాలు , టిక్కెట్ల పంపిణీ సహా సర్వం సహా అధినేత జగన్ అనేది జగమెరిగిన సత్యం. రెండోవరసలో కీలక వ్యక్తులెవరు? అన్నది పార్టీ ఇంకా తేల్చుకోవాల్సి ఉంది. వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్టీ పెట్టినప్పట్నుంచి కీలకమైన నేతగా వ్యవహరిస్తూ వచ్చారు జగన్ సమీపబంధువు వై.వి.సుబ్బారెడ్డి. ఆర్థిక అక్రమాల కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా జగన్ 16 నెలలపాటు జైలులో ఉన్నప్పుడు పార్టీకి అన్నీ తానై చక్రం తిప్పారాయన. ఆ సందర్బంగా ఆందోళనలు నిర్వహించడం,పార్టీకి దిశానిర్దేశం చేయడం వంటి పనులన్నీ తన భుజస్కంధాలపైనే వేసుకున్నారు. జగన్ సోదరి షర్మిల చేత పాదయాత్ర చేయించడంలోనూ కీలకపాత్ర పోషించారు. పార్టీ పెట్టిన తొలిమూడేళ్లు నంబర్ 2 గా వై.వి.సుబ్బారెడ్డినే పార్టీ గుర్తించేది. పార్టీని, వై.ఎస్. కుటుంబాన్ని అనుసందానం చేసుకుంటూ జగన్ పరోక్షంలో అవసరమైన నిర్ణయాలను ఆయనతీసుకునేవారు. ఏడాదికాలంగా ఈ పరిస్థితుల్లో మార్పులొచ్చేశాయి. జగన్ కు సంబంధించిన ఆర్థిక అక్రమాల కేసులన్నింటిలోనూ రెండో ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి కేసులకు సంబంధించి న్యాయపరమైన విషయాలు, ఆర్థికపరమైన సర్దుబాట్లు, సాక్షిమీడియా గ్రూపునకు సంబంధించిన విషయాలను చూసుకునేవారు. గత సంవత్సరం ఆయన పూర్తిస్థాయి రాజకీయ నాయకునిగా రూపుదాల్చారు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైనది మొదలు పార్టీలోనూ నిర్ణయాత్మక శక్తిగా మారిపోయారు. పార్టీ ప్రధానకార్యదర్శిగా హోదా, పార్లమెంటులో పార్టీవాణిని వినిపించే బాద్యతలను ఆయనకే అప్పగించారు. అప్పటివరకూ ఢిల్లీలో వై.వి.సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహనరెడ్డి వంటివారు పార్టీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. వారి స్థానాన్ని ప్రస్తుతం విజయసాయి రెడ్డి ఆక్రమించేశారు.
తాజా పదోన్నతి తకరారు....
పార్టీలో విజయసాయిరెడ్డి ఎంతకీలకంగా ఉన్నప్పటికీ క్యాడర్ లోనూ, ద్వితీయ శ్రేణి నాయకత్వంలోనూ ఆయన పట్ల పూర్తిస్థాయి విశ్వాసం ఏర్పడలేదు. జగన్ పరోక్షంలో పార్టీని ముందుకు నడపగలరన్న నమ్మకం కూడా నెలకొనలేదు. ఇంకా అనేకమంది నియోజకవర్గ స్థాయి నాయకులు వివిధాంశాలపై వై.వి.ని సంప్రతిస్తున్నారు. ముఖ్యంగా ప్రశాంతకిషోర్ బృందం క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న సర్వేలు, పార్టీ కార్యక్రమాల అమలుకు సంబంధించిన సూచనలు, సలహాలు, నాయకుల మధ్య సమన్వయలోపాలు వంటివన్నీ ఇప్పటికీ సుబ్బారెడ్డి దృష్టికే తెస్తున్నారు. పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సుబ్బారెడ్డి ఆయా అంశాలను జగన్ వద్ద ప్రస్తావించేందుకు ప్రయత్నించినప్పుడు సానుకూలమైన స్పందన రాలేదనేది పార్టీ వర్గాల సమాచారం. ఆయా విషయాలను విజయసాయి రెడ్డి పరిష్కరిస్తారని నేరుగానే జగన్ చెప్పేసినట్లు తెలుస్తోంది. ఒక రకంగా నా వరకూ ఈ విషయాలను తేవాల్సిన అవసరం లేదు. విజయసాయిరెడ్డికి చెబితే సరిపోతుందన్నట్లుగా జగన్ ప్రవర్తించారని పార్టీలోని కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కొంత నొచ్చుకుని పార్టీ కార్యకలాపాల్లో సుబ్బారెడ్డి చొరవ చూపడం మానేశారంటున్నారు. రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేని విజయసాయి రెడ్డికి నియోజకవర్గాల సమస్యలు తాను వివరించి చెప్పడం తన స్థాయికి తగదని భావించి మౌనంగా ఉండిపోతున్నారంటున్నారు. వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉంటే తప్ప విజయసాయిని నేరుగా ఎవరూ అప్రోచ్ కావడం లేదు.దీంతో పార్టీలో నెలకొన్న తీవ్రస్థాయి విభేదాలను పరిష్కరించే అగ్రనాయకత్వం కరవు అవుతోంది. అవసరం లేకపోయినప్పటికీ తాజాగా పాదయాత్రకు పదిరోజుల ముందు విజయసాయి రెడ్డిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జగన్ నియమించారు. దీని ద్వారా పార్టీ క్యాడర్ కు, జిల్లాల నాయకత్వానికి ఒక సంకేతం పంపించదలిచారు. పార్టీ నిర్ణయాల్లో తన తర్వాత స్థానం ఆయనదే అని చెప్పడమే ఈ ప్రకటన సారాంశం.
రాజకీయ భిన్న ధృవాలు....
పార్టీ పరంగా సుబ్బారెడ్డి ప్రాధాన్యం తగ్గించిన జగన్ విజయసాయిని సెకండ్ ప్లేస్ కు ప్రమోట్ చేశారు. ప్రవర్తన శైలిలో వీరిద్దరూ భిన్నధృవాలుగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. సుబ్బారెడ్డి కలుపుగోలుతనంతో ఉంటూ పలకరింపులు,యోగక్షేమాలతో నాయకులతో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటారు. అనుబంధాన్ని పంచుకుంటారు. ఇందువల్ల ఆయనతో మనసు విప్పి మాట్టాడటానికి నాయకులు ఇష్టపడతారు. లోపాలను కూడా దాచుకోకుండా చెప్పేస్తారు. అదే విజయసాయి విషయానికొచ్చేసరికి టు ది పాయింట్ అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. పూర్తిస్థాయి బ్యూరోక్రాటిక్ స్టైల్ లో పార్టీని, నాయకులను డీల్ చేస్తుంటారాయన. దీంతో ఆయనతో మాటామంతీ కలపడానికి, ముచ్చట్లు చెప్పడానికి నాయకులు పెద్దగా ఇష్టపడరు. ఆయన కూడా దానిని ఎంకరేజ్ చేయరు. దీనివల్ల ఫీల్డ్ లెవెల్ ఫీడ్ బ్యాక్ పార్టీ అగ్రనాయకత్వానికి లభించదు. అయితే సుబ్బారెడ్డి కంటే జగన్ కు విజయసాయి రెడ్డి అత్యంత విశ్వాసపాత్రుడు. సొంత నిర్ణయాలు తీసుకోకుండా తన దృష్టికి వచ్చిన ఏ చిన్న విషయాన్నైనా జగన్ కు నివేదిస్తుంటారాయన. ఈ వైఖరి నచ్చడం వల్లనే ఆయనను తన తర్వాత ద్వితీయ స్థానంలో కూర్చోబెట్టేందుకు సాహసించారు. సుబ్బారెడ్డి తనంతతాను కొన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం , టిక్కెట్ల కేటాయింపునకు సంబంధించి కూడా కొందరికి హామీలు ఇవ్వడం వంటివి జగన్ కు గతంలో నచ్చలేదు. అయినప్పటికీ కుటుంబపరంగా , పార్టీ పరంగా అవసరం ఉండటంతో ఆయనను పూర్తిస్థాయిలో దూరంగా పెట్టకుండానే బాధ్యతలు మాత్రం విజయసాయికి అప్పగిస్తూ వస్తున్నారు.
పాదయాత్ర బాధ్యతల పంపిణీ....
జనసంకల్ప యాత్ర లో పార్టీ పరంగా ఈ ఇద్దరు నాయకులకు జగన్ బాధ్యతలను సమానంగా పంపిణీ చేశారు. అయితే భారత యుద్ధ సందర్భంగా అర్జునుడు, దుర్యోధనుడు శ్రీక్రుష్ణుని సహకారం కోసం వస్తారు. ముందుగా వచ్చిన దుర్యోధనుడి వైపు చూడకుండా అర్జునుడిని చూసి తన పక్షపాతం ప్రదర్శిస్తాడు శ్రీక్రుష్ణుడు. అలాగే పాదయాత్రలో నాయకులతో మంతనాలు, సమన్వయం, పర్యవేక్షణ వంటి కీలక అంశాలను చూసే అధికారం, బాధ్యతలను విజయసాయికి అప్పగించారు. ఆర్థికఅంశాలకు సంబంధించిన విషయాల్లోనూ ఆయన మాటే ఫైనల్. పాదయాత్ర జరిపే ప్రాంతాల రూట్ మ్యాప్, జనసమీకరణ వంటి అంశాలను సుబ్బారెడ్డికి అప్పగించారు. పవర్ సెంటర్ విజయసాయి వద్ద ఉండగా , భారం మాత్రం సుబ్బారెడ్డికి మిగిలిందని ముఖ్యనాయకులు వాపోతున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్