మోదీకి....దీదీ.... కొరకరాని కొయ్యగా మారారే?
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కన్నా... ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడమే భారతీయ జనతా పార్టీకి సంక్లిష్టమైన పని కానుంది. ప్రాంతీయ పార్టీల్లో కూడా చాలా వరకూ నరేంద్రమోడీ నాయకత్వాన్ని కాదని ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఇద్దరే ఇద్దరు ముఖ్యమంత్రులు మోడీతో నిత్యం ఢీ అంటే ఢీ అంటున్నారు. వారే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఏడు పార్లమెంటు స్థానాలు గల ఢిల్లీ కన్నా 42 లోక్ సభ స్థానాలు గల పశ్చిమబెంగాల్ పైనే పట్టుకోసం బీజేపీ నాయకత్వం పూర్తిగా దృష్టి పెట్టింది. మమతను రాజకీయంగా దెబ్బతీసేందుకు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇప్పటికిప్పుడు పశ్చిమబెంగాల్ పీఠాన్ని చేజిక్కించుకోలేమన్న సంగతి బీజేపీకి తెలుసు. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా సంపాదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండగా మూడు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన సీపీఎం మూడోస్థానంలో ఉంది. ప్రస్తుతానికి పెద్దగా సానుకూల పరిస్థితులు లేనప్పటికీ భవిష్యత్తులో మమతను దెబ్బతీయడం అంతకష్టమేమీ కాదన్నది బీజేపీ పెద్దల అభిప్రాయంగా ఉంది.
హిందుత్వ శక్తుల ఏకీకరణ ద్వారా......
హిందుత్వ శక్తుల ఏకీకరణ ద్వారా 2019 లోక్ సభ ఎన్నికల్లో లబ్దిపొందాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. ముస్లిం ఓట్లతో మూడు దశాబ్దాల పాటు గతంలో సీపీఎం రాష్ట్రాన్ని పాలించింది. ప్రస్తుతం మమత వారి ఓట్ల అండతోనే ముందుకు వెళ్లాలనుకుంటోంది. దానికి విరుగుడుగా ముస్లిం వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేసి లబ్ది పొందాలన్నది కమలనాధుల వ్యూహం. 2014 లోక్ సభ ఎన్నికల్లో 17 శాతం ఓట్లను సాధించింది. కాని తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు అసెంబ్లీ స్థానాలకు పరిమితమయింది. అయినప్పటికీ నిరాశ పడలేదు. హిందుత్వ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా లబ్దిపొందేందుకు పావులు కదుపుతోంది. ఇటీవలి దుర్గామాత నిమజ్జన కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకుంది. ఈ నెల 30న విజయదశమి సందర్భంగా రాత్రి పది గంటల వరకే నిమజ్జన కార్యక్రమాలను చేపట్టాలని మమత సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాని అదే సమయంలో అక్టోబర్ 1న ముస్లింల పండగైన మొహరం సందర్భంగా దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై పూర్తి నిషేధం విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ విశ్వహిందూ పరిషత్ నేతలు కోల్ కత్తా హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి రాజేష్ తివారీ ఆధ్వర్యంలో ధర్మాసనం సర్కార్ నిర్ణయాన్ని కొట్టివేసింది. అంతేకాక ప్రజల మధ్య విభజన గీతలు గీయవద్దని చురకలు అంటించింది. కోర్టు తీర్పుపై మమత తీవ్రంగా స్పందించగా, వీహెచ్ పీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. దుర్గా మాత విగ్రహాల నిమజ్జనంతో పాటు హిందూ దేవతల సంప్రదాయ ఆయుధాలను కూడా ఊరేగించాలని వారు నిర్ణయించారు. మరోపక్క మాల్దా మత ఘర్షణలతో పాటు బంగ్లాదేశ్ శరణార్ధుల అంశాన్ని కూడా వివాదాస్పదం చేయాలని బీజేపీ భావిస్తోంది. మాల్దా జిల్లాలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. ఒకప్పటి కాంగ్రెస్ కేంద్రమంత్రి అబ్దుల్ ఘనీఖాన్ చౌథురి ఈ ప్రాంతం వారే. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రానికి వలసలు నిత్యకృత్యం. వారిలో ముస్లింలే అధికం. వీరు గతంలో సీపీఎంకు వెన్నుదన్నుగా ఉండేవారు. ప్రస్తుతం మమతకు మద్దతుగా ఉన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మమత బెనర్జీ మాల్దా నుంచే ప్రారంభించడం గమనార్హం. ముస్లిం ఓటర్లే లక్ష్యంగా ఆమె పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 27.5 శాతం ముస్లిం ఓటర్లున్నట్లు అంచనా. వారి ఓట్లతో అధికారాన్ని నిలబెట్టుకోవడం కష్టమేమీ కాదన్నది మమత అంచనా. ఈ ఉద్దేశంతో విజయదశమి ఉత్సవాలపై నిషేధాన్ని విధించి మొట్టికాయ వేయించుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ రాసిన నాటకాన్ని టీవీల్లో ప్రసారం కాకుండా నిషేధం విధించారు. మరో రచయిత సల్మాన్ రష్దీ కోల్ కత్తా పర్యటనపై కూడా నిషేధం విధించారు. ముస్లింలు పదిశాతం కన్నా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉర్దూకు జాతీయ అధికార భాష హోదా కల్పించారు.
వలసలను ప్రోత్సహిస్తూ......
మమత చర్యలకు విరుగుడుగా బీజేపీ ఆమెను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. శారద, నారద కుంభకోణాల్లో ప్రమేయం గల తృణమూల్ కాంగ్రెస్ నాయకులను వరుసబెట్టి అరెస్ట్ చేసింది. వీరిలో తృణమూల్ మంత్రి కూడా ఒకరుండటం గమనార్హం. ఈ కుంభకోణాలు మమతను ప్రతిష్టను దిగజార్చాయి. తృణమూల్ కూడా సంప్రదాయ ప్రాంతీయ పార్టీనేనని, దానికి ప్రత్యేకత ఏమీ లేదని బీజేపీ ప్రచారం చేస్తోంది. తృణమూల్ నుంచి రాజకీయ వలసలను ప్రోత్సహించడం ద్వారా పార్టీని నిర్వీర్యం చేయాలని, పార్టీ శ్రేణుల్లో నైతిక స్థయిర్యం దెబ్బతీయాలని బీజేపీ పథక రచన చేస్తోంది. ఇందులో భాగంగానే తృణమూల్ అగ్రనేత ముకుల్ రాయ్ రాజీనామాగా చెబుతున్నారు. ముకుల్ రాయ్ ఆషామాషీ నేత కాదు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. రాజ్యసభ సభ్యుడు. గతంలో కేంద్రంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. పైకి చెబుతున్నప్పటికీ ఆయన బీజేపీ గూటికి చేరడం ఖాయం. రాయ్ తరహాలోనే మరికొందరు నేతలు కూడా రానున్న కాలంలో పార్టీని వీడతారన్న ప్రచారం జరుగుతోంది.
ఓట్లు ఉన్నా..... సీట్లేవీ?
రాజకీయ వ్యూహాలు, ఎత్తులు ఎలా ఉన్నా రాష్ట్రంలో బీజేపీ ఓట్ల శాతం, సీట్లు అంత గొప్పగా ఏమీలేవు. 2009 లోక్ సభ ఎన్నికల్లో 16.4 శాతం, 2014లో 17.2 శాతం ఓట్లు పార్టీ ఖాతాలో జమయ్యాయి. కాని 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10.7 శాతం ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గూర్ఖా జన్ ముక్తి మోర్చాతో పొత్తు పెట్టుకుని సాధించింది ఆరు స్థానాలే కావడం గమనార్హం. అయితే గత నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలవడం ఊరట కలిగించే పరిణామం. ముఖ్యంగా ఉత్తర బెంగాల్ లోని బునియాద్ పూర్ లో 28 శాతం, ధూప్ గిరిలో 41 శాతం ఓట్లు సాధించడం పార్టీ శ్రేణుల్లో స్థయిర్యాన్ని నింపింది. అయితే ఓట్లు వస్తున్నా... వాటిని సీట్లుగా మార్చుకోవడంలో విఫలమయ్యామని బీజేపీ పెద్దలు గ్రహించారు. ఈ లోపాన్ని చక్కదిద్దుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో సంస్థాగత వ్యవహారాలను సమన్వయం చేసుకోవాలని భావిస్తున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో సంతృప్తికరమైన స్థానాలు లభిస్తే మున్ముందు మమతను ఎదుర్కోవడం అంతకష్టం కాదన్నది కమలనాధుల అభిప్రాయం.
-ఎడిటోరియల్ డెస్క్