రాహుల్ కు ముందుంది....!
రాహుల్ గాంధీ పప్పు...ఆయన ఓ అర్భకుడు.... అయోమయం మనిషి... అనామకుడు... చంచలస్వభావి...ఇవీ ఇటీవల వరకూ ఆయనపై వివిధ వర్గాల నుంచి విమర్శలు, వ్యాఖ్యలు. వందేళ్లకు పైగా చరిత్రగలిగిన పార్టీకి సారథ్యం వహించే శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు, నాయకత్వ పటిమ, రాజకీయ పరిపక్వత లోపించాయన్న ఆందోళన, ఆవేదన స్వపక్షం నుంచే విన్పించేవి. తల్లి చాటు బిడ్డగా పరిగణించేది. ఇక ప్రచార, ప్రసార మాధ్యమాలు ఆయనపై వేసిన కార్టూన్లు, రాసిన విమర్శలకు లెక్కేలేదు. మోడీకి సరితూగగల నాయకుడు కానే కాదన్న వ్యాఖ్యలు విన్పించేవి. 2019 ఎన్నికల్లో రాహుల్ సారథ్యంలో పార్టీ ఎన్నికలకు వెళితే ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదన్న వాదనలు, రాజకీయ వర్గాల్లో వినపడేవి. అసలు గుజరాత్ ఎన్నికలను ఎదుర్కోగలరా? అన్న ప్రశ్నలు, అనుమానాలు తలెత్తాయి.
మారిన మనిషిగా....
కాని ఇప్పుడు అదంతా చరిత్ర. ఇప్పుడు రాహుల్ మారిన మనిషి. నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి. తన పనితీరు, వ్యవహార శైలి ద్వారా పార్టీ భవిష్యత్ పై కార్యకర్తలు, నాయకుల్లో విశ్వాసాన్ని నింపగలుతున్నారు. విమర్శలు, ప్రతివిమర్శల్లో పరిణితి చూపుతున్నారు. వెనుకటిలాగా తొట్రుపాటు, తటపటాయింపు కనపడటం లేదు. ఎన్టీఏ ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోగల నాయకుడిగా అవతరిస్తున్నారు. తనకంటూ యువనేతల బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. సీనియర్ల పట్ల తిరస్కార భావం లేకుండా వారి అనుభవాన్ని గుర్తిస్తున్నారు. గౌరవిస్తున్నారు.
వరుస విజయాలు...
గాంధీల కుటుంబ వారసుడిగా ఈ నెల 16న అటు భారత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాహుల్ కు శుభ సంకేతాలు అందుతున్నాయి. ఈ నెల17న వెల్లడయిన పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. విపక్ష అకాలీదళ్, బీజేపీలు చిరునామాలు గల్లంతయ్యాయి. 32కుగాను 29 పురపాలక సంఘాలు పార్టీ పరమయ్యాయి. అమృత్ సర్, జలంథర్, పాటియాలా వంటి నగర పాలకసంస్థల్లో రికార్డు స్థాయి విజయాన్ని కాంగ్రెస్ నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 267 వార్డులను తన ఖాతాలో వేసుకుంది. అకాళీదళ్ 37, బీజేపీ 15, స్వతంత్రులు 94 స్థానాలను చేజిక్కించుకున్నారు.
వచ్చే ఏడాది కీలకం...
ఈనెల18న వెల్లడయిన గుజరాత్ ఫలితాల్లో పార్టీ ఓడి గెలిచింది. 22 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపికి చుక్కలు చూపించింది. 77 స్థానాల్లో అధికారం అంచులదాకా వెళ్లి పార్టీ శ్రేణుల్లో భవిష్యత్ పై ఆశలను నింపింది. మరో 12 స్థానాలు లభించి ఉన్నట్లయితే అధికారాన్ని అందుకుని ఉండేది. ఇక హిమాచల్ ఓటమి అంత తీవ్రంగా పరిగణించనక్కరలేదు. గత మూడు దశాబ్దాలుగా అధికార పార్టీ ఓడిపోవడం ఆనవాయితీగా వస్తోంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్ కుమార్ థుమాల్ ఓటమి ద్వారా ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. పుదుచ్చేరిలో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ విజయం సాధించడం విశేషం. ఎన్నికలతోనే సరిపెట్టకుండా ఫలితాల అనంతరం కూడా మూడు రోజుల పాటు గుజరాత్ రాష్ట్రంలో రాహుల్ పర్యటించడం ఆయన కార్యదీక్షకు నిదర్శనం. పార్టీ లోటుపాట్లు, నైపుణ్యాల గురించి సమగ్రంగా చర్చించడానికి, అధ్యయనం చేయడానికి ఆయన ఈ పర్యటనను వినియోగించుకోనున్నారు. ఢిల్లీలో కూర్చుని సమీక్షించే పాతకాలపు పద్థతులకు స్వస్తి పలికి నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం మంచి పరిణామం. గుజరాత్ లో ఓట్ల శాతం పెరగడం ఆశావహ పరిణామం. గత ఎన్నికల్లో 38.9 శాతం ఓట్లు రాగా ఈ దఫా 41.4 శాతానికి పెరిగింది. సీట్లు కూడా 60 నుంచి 77 కు పెరిగాయి. మొత్తానికి గుజరాత్ ఎన్నికలు రాహుల్ ను పోరాట యోధుడిగా నాయకుడిగా తీర్చిదిద్దాయి. 2018 రాహుల్ నాయకత్వ పటిమకు అగ్ని పరీక్ష. వచ్చే ఏడాది 8 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా ఫిబ్రవరిలో త్రిపుర, మేఘాలయ, నాగాల్యాండ్, మే నెలలో కర్ణాటక, ఏడాది అంతంలో మధ్యప్రదేశ్, చత్తీష్ ఘడ్, రాజస్థాన్ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో మేఘాలయ, కర్ణాటకల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండింటినీ కాపాడుకోవడంతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కొన్నింటిలోనైనా గెలిస్తేనే... 2019 లోక్ సభ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొనగలరు.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- రాహుల్ గాంధీ