వంటింటి నుంచీ ..ఇంటింటి వరకూ బీజేపీ సక్సెస్ అవుతుందా?
ప్రజా జీవనప్రమాణాలు మెరుగయ్యేలా భాజపాను ప్రజల చేతిలో పనిముట్టుగా మలచాలి. ఆ దిశలోనే మనం ప్రయత్నిస్తున్నామంటూ ప్రధాని నరేంద్రమోడీ తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలకనేతలనుద్దేశించి చెప్పారు. అధికారం పరిరక్షించుకునేందుకు, పునరధికారం సాధించుకునేందుకు భాజపా కు పనిముట్లు ఏమిటనే అంశంపై సందేహాలకు అతీతంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు దిశానిర్దేశం చేశాయి. 2019 ఎన్నికలకు అవసరమైన ప్రచార హోరు, పథకాల జోరుకు ఈ సమావేశాల్లోనే శ్రీకారం చుట్టేసినట్లయింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ శాసనసభ్యులు 13వందలమంది, 13 మంది ముఖ్యమంత్రులు, ఆరుగురు ఉపముఖ్యమంత్రులు, 275 మంది ఎంపీలు, 60 మంది కేంద్రమంత్రులు, అగ్రనేతలు మొత్తం 2300 మంది వరకూ పాల్గొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి సంబంధించిన శిఖరాగ్ర సమావేశంగా దీనిని అభివర్ణించాలి. అగ్రనాయకులైన మోడీ, అమిత్ షాల ద్వయం పార్టీ విధి విధానాలతో ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేసుకుంటూ ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే విషయమై స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు.
విపక్షాల కంటే ముందుగానే.....
సాధారణంగా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 120 నుంచి 125 మంది వరకూ మాత్రమే అగ్రనాయకులు పాల్గొంటూ ఉంటారు. ఈ సారి దీని పరిధిని విస్తృత పరిచారు. భారీ ఎత్తున నిర్వహించారు. మధ్యవర్తులు, పార్టీ అనుసంధాన కర్తల పాత్ర లేకుండా నేరుగానే సందేశాన్ని ద్వితీయ శ్రేణి నాయకత్వానికి చేరవేయాలని సంకల్పించారు. శషభిషలకు తావు లేకుండా అగ్రనాయకుల మదిలో ఏముందో ప్రజాక్షేత్రంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ అర్థమవ్వాలనే ఉద్దేశంతోనే ఈ శిఖరాగ్ర సమ్మేళనాన్ని తలపెట్టారు. ఇకముందు ప్రతి అడుగూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు సంబంధించి సాగిన చర్చలు, రాజకీయకసరత్తు చూస్తే అధికార బీజేపీ ప్రతిపక్షాల కంటే ముందుగానే రంగంలోకి దిగుతున్న వాతావరణం స్పష్టమవుతోంది. 2019 కు ముందుగానే గుజరాత్,కర్ణాటక, హిమాచలప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ఎన్నికలకు వెళ్లబోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెసుతో బీజేపీ ముఖాముఖి తలపడాల్సి ఉంది. తాను అధికారంలో ఉన్న గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లలో అధికారాన్ని నిలుపుకోవడంతోపాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లను చేజిక్కించుకోవడమూ కమలనాథుల లక్ష్యంగా ఉంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలపైనా బీజేపీ దృష్టిసారించింది. బీజేపీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందుకనే తగినంత వ్యవధి ఉండగానే ముందస్తుగానే విస్తృత జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించింది. లోపాలను సరిదిద్దుకుంటూ వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశమూ కనిపిస్తోంది. ఈ దిశలో ఉత్తరప్రదేశ్ నమూనా మంచి ఫలితాన్నిచ్చింది. పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఉజ్వల్ పథకం ఈ రాష్ట్రంలోనే ప్రారంభించారు. 2016 మే నెలలో పథకం ప్రారంభమైంది. మొత్తం పథకం లక్ష్యం అయిదు కోట్ల కనెక్షన్లు. యూపీ ఎన్నికల నాటికి ఈ పథకంలో భాగంగా దేశంలో రెండు కోట్ల పైచిలుకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తే యూపీలోనే 75 లక్షల కనెక్షన్లు ఇచ్చారు. ఎన్నికలలో ఇది మంచి దిగుబడి నిచ్చింది. కాంగ్రెసు, సమాజవాదీ జట్టు కట్టినా, నోట్ల రద్దు ఇబ్బంది పెట్టినా ప్రతి కూల పరిస్థితులను అధిగమించి బీజేపీ అతిపెద్ద విజయం సాధించింది. మహిళా ఆదరణ పొందిన ఉజ్వల్ పాత్ర ఈ విజయంలో అతికీలకంగా బీజేపీ భావిస్తోంది.
అనేక పథకాలతో......
భవిష్యత్తులో మరో మూడు కోట్ల కనెక్షన్ల లక్ష్యంతో ఉజ్వల్ ను భారీగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిని ఓట్లుగా మలచుకోవడంపై పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాలని జాతీయ కార్యవర్గం సంకేతాలిచ్చింది. స్వచ్ఛభారత్ లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం వంటిపథకాలు కూడా బీజేపీకి ప్రచారానికి ఉపకరించేవే. చిన్నాచితకా వ్యాపారాలకు ఆర్థిక సాయానికి ఉద్దేశించిన ముద్ర యోజన పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదని పార్టీ భావిస్తోంది. ఎస్సీ,ఎస్టీ, మహిళ, యువతను టార్గెట్ చేస్తూ ఉపాధి కల్పనకు ఉద్దేశించిన పథకమది. దీనికి కొత్త ఊపును తీసుకురావాలని కూడా కేంద్రం భావిస్తోంది. ఇక తాజాగా దేశంలోని మూలమూలల్లో విద్యుత్తు వెలుగులకు నోచుకోని 18 వేల గ్రామాల్లోని 4 కోట్ల కుటుంబాలకు ఇంటింటికీ విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వాలనే సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య) పథకం బీజేపీ అమ్ముల పొదిలో మరో తూణీరం కాబోతోంది. స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా దేశంలోని అన్నిగ్రామాలకు, ఇళ్లకు విద్యుత్తుసౌకర్యం కల్పించలేకపోయామంటే బాధాకరమైన విషయమే. అయితే కొండప్రాంతాలు, అటవీ ప్రాంతాలు విద్యుత్ నెట్ వర్కునకు చాలా దూరంగా ఉన్నాయి. అందువల్ల వాటిని కూడా అనుసంధానించేందుకు ఈ పథకంలో వెసులుబాటు కల్పిస్తున్నారు. సోలార్ పవర్ ప్యాక్ , ఎల్ఈడీ దీపాల వంటివాటినీ అందచేసేందుకు రూపకల్పన చేశారు. అయిదేళ్లపాటు నిర్వహణను కూడా ఆయా కంపెనీలే చూసేలా విధి విధానాలు ఖరారు చేశారు. దీనివల్ల మారుమూల అభివృద్ధికి నోచుకోని కోట్లమంది ప్రజల ఇళ్లల్లో విద్యుత్తు వెలుగులు విరబూసే అవకాశాలున్నాయి. ఒక చేతిలో వంటింటి గ్యాస్, మరో చేతిలో ఇంటింటి వెలుగు పట్టుకుని ఎన్నికల ప్రస్థానానికి వెళ్లబోతున్న కమలనాథులకు ఓట్ల ‘సౌభాగ్యం’ కురుస్తుందో ‘ఉజ్వల’ భవిష్యత్తు వరిస్తుందో కాలమే తేల్చి చెప్పాలి.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- బీజేపీ