జగన్ బంపర్ విక్టరీని ఓర్వలేకపోతున్నారా
తెలుగు రాజకీయాల్లో చూస్తే బీజేపీకి ఎంత వేగంగా అధికారం పట్టేద్దామా అన్న యావ ఎక్కువైపోతోంది. అయితే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు తెలంగాణాలో, ఏపీలో ఉన్నాయి. కేసీయర్ [more]
తెలుగు రాజకీయాల్లో చూస్తే బీజేపీకి ఎంత వేగంగా అధికారం పట్టేద్దామా అన్న యావ ఎక్కువైపోతోంది. అయితే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు తెలంగాణాలో, ఏపీలో ఉన్నాయి. కేసీయర్ [more]
తెలుగు రాజకీయాల్లో చూస్తే బీజేపీకి ఎంత వేగంగా అధికారం పట్టేద్దామా అన్న యావ ఎక్కువైపోతోంది. అయితే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు తెలంగాణాలో, ఏపీలో ఉన్నాయి. కేసీయర్ రాజకీయ చాణక్యుడు, ఆయ్యన్ని కదపడం అంటే కొరివితో తల గొక్కోవడమే. ఇక ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన జగన్ అధ్భుతమైన ప్రజాకర్షణ కలిగిన యువ నాయకుడు. మరి ఈ ఇద్దరూ ఇపుడు బీజేపీకి సవాల్ గా మారారు. ఉత్తరాదిని వూపేసి కన్నడ సీమలో కసిదీరా గెలుపు వరకూ వచ్చిన బీజేపీ తెలంగాణాలోనూ తన హవా కొంతవరకూ చాటుకుంది కానీ ఏపీ విషయంలో మాత్రం అసలు కుదిరి చావడంలేదు. గత ఎన్నికల కంటే తీసికట్టుగా నోటా కంటే తక్కువగా ఓట్లు జీరో సీట్లు తెచ్చుకున్న బీజేపీకి ఇపుడు విజయాల వైభవంతో వెలిగిపోతున్న జగన్ కన్నెర్రగా మారాడంటున్నారు.
తొలి రోజు నుంచి కూడా….
ఏపీలో చంద్రబాబు, మోడీ సావాసం నాలుగేళ్ల పాటు చక్కగా సాగింది. దాంతో బాబుకు ఏ ఇబ్బందీ లేకుండా పోయింది. చివరి ఏడాది కటీఫ్ కొట్టి నానా కష్టాలు బాబు తెచ్చుకున్నారు. ఇపుడు జగన్ పరిస్థితి అందుకు భిన్నం, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి బీజేపీ ఎర్ర జెండా చూపిస్తోంది. ఇదేమంటే బాబు కొట్టిన దెబ్బకు గుణపాఠం ఇది అంటోంది. జగన్ ఏ తప్పు చేశారంటే ఆయనకు ఆ అవకాశం ఇవ్వకుండా ముందు జాగ్రత్తట. జగన్ వరకూ కేంద్రంతో సఖ్యతగా ఉందామనే చూస్తున్నారు. ఎందుకంటే ఆయన బాధలు ఆయనవి. ఎలా చూసుకున్నా అప్పుల కుప్పగా ఏపీ ఉంది. కేంద్రమే అన్ని విధాలుగా ఆదుకోవాలి, లేకపోతే ఇబ్బందులో పడతామన్న ఉద్దేశ్యంతో జగన్ మెత్తగా ఉంటున్నారు. ఇదే ఇపుడు బీజేపీకి అలుసు అయిపోయింది.
బడ్జెట్ తో మొదలెట్టి…..
ఏపీకి కేంద్ర బడ్జెట్ లో పూచిక పుల్ల సాయం కూడా చేయలేదు, ఇదేమంటే అన్నీ చేసేశామని పాత పాట పాడుతున్నారు బీజేపీ పెద్దలు. విభజన హామీలు అలాగే ఉన్నాయి. ప్రత్యేక హోదా వూసే లేదు. అది జగన్ అడిగితే నేరంగా బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇక పోలవరం, రాజధాని గురించి మాట్లాడడం లేదు. మరి ఇలా అయితే ఎలా అని అంటే మేము చేస్తాం, చేస్తున్నాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇక లేటెస్ట్ గా మరో విషయమేంటంటే ఏపీలో అవినీతికి మారు పేరుగా మారిన విద్యుతు కొనుగోళ్ళు ఒప్పందాలపై ఘాటు లేఖలు రాస్తూ ముఖ్యమంత్రి జగన్ కి బ్రేకులు వేస్తున్నారు.
కయ్యానికి కాలు దువ్వితే…
చిత్తం వచ్చినట్లుగా ఒప్పందాలు కుదుర్చుకుని ప్రజల సొమ్ముని అయిన కాడికి పంచేసుకున్న ఈ ఒప్పందాలపై జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అగ్గి రాజెస్తూనే ఉన్నారు. కానీ ఇపుడు మాత్రం వాటిని ముట్టుకోవద్దు అని కేంద్రం అంటోంది. మరి అవినీతి లేని ప్రభుత్వమని చెప్పుకుంటున్న మోడీ సర్కార్ కి ఈ విషయంలో ఎందుకు ఇంత ఉలుకో అర్ధం కావడంలేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఏదో విధంగా జగన్ తెగించి కయ్యానికి కాలు దువ్వితే ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని నానా ఇబ్బందులు పెట్టాలని బీజేపీ ఎత్తులు వేస్తోందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.