బాబు షాకింగ్ డెసిషన్… ఆమెకు హామీ?
తోట సీతారామ లక్ష్మి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సుదీర్ఘకాలం అధ్యక్షురాలిగా కొనసాగారు. ఓ మహిళ టీడీపీ నుంచి ఓ జిల్లాకు అంత కాలం పాటు ఎప్పుడూ అధ్యక్షురాలిగా [more]
తోట సీతారామ లక్ష్మి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సుదీర్ఘకాలం అధ్యక్షురాలిగా కొనసాగారు. ఓ మహిళ టీడీపీ నుంచి ఓ జిల్లాకు అంత కాలం పాటు ఎప్పుడూ అధ్యక్షురాలిగా [more]
తోట సీతారామ లక్ష్మి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సుదీర్ఘకాలం అధ్యక్షురాలిగా కొనసాగారు. ఓ మహిళ టీడీపీ నుంచి ఓ జిల్లాకు అంత కాలం పాటు ఎప్పుడూ అధ్యక్షురాలిగా లేరు. ఈ అరుదైన రికార్డు ఆమెకే సొంతం అయ్యింది. 2014 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిన ఆమెకు చంద్రబాబు 2014 ఎన్నికల్లో రాజ్యసభకు ఎంపిక చేశారు. కాపు సామాజిక వర్గంలో మహిళా నేతగా ఉన్న తోట సీతారామ లక్ష్మిని రాజ్యసభకు పంపండం పెద్ద సంచలనమే అయ్యింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గత ఎన్నికల్లో పార్టీ ఓడాక పలువురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరినా ఆమె మాత్రం పార్టీనే అంటి పెట్టుకుని ఉన్నారు.
పదవులు ఇవ్వకపోవడంతో….
ఇటీవల పార్టీ పదవుల పంపకాల్లో ఆమెను నరసాపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలి పదవికి పరిమితం చేశారు. ఉమ్మడి జిల్లాకే అధ్యక్షురాలిగా ఉన్న తాను ఈ చిన్న పదవిలో కొనసాగలేనని చెప్పినా బాబు ఆమెను బలవంతం చేసి ఈ పదవి కట్టబెట్టారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ పరంగా కీలక పదవులపై తోట సీతారామ లక్ష్మి పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. గత ఎన్నికల సమయం నుంచే చంద్రబాబుపై ఆమె గుస్సాతో ఉన్నారు. ఆ ఎన్నికల్లో తన తనయుడు తోట జగదీశ్కు భీమవరం లేదా జిల్లాలో మరో అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆమె కోరినా బాబు ఆమె విన్నపాన్ని పట్టించుకోలేదు. తాజాగా పార్టీ పదవుల్లోనూ నరసాపురం పార్లమెంటరీ పగ్గాలంటూ ఆమె పాత్రను కుదించేయడంతో ఆమె అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఒకటి రెండు రోజులు పార్టీ నేతలకు టచ్లోకి వచ్చేందుకు ఇష్టపడలేదు.
బాబు హామీతో….
ఆ తర్వాత జిల్లాకు చెందిన కొందరు ప్రముఖులతో ఆమెను బాబు బుజ్జగించడంతో పాటు కొన్ని హామీలు ఇవ్వడంతో ఆమె శాంతించారు. ఆమె ఏ పార్లమెంటు స్థానానికి పార్టీ తరపున అధ్యక్షురాలిగా ఉన్నారో ? వచ్చే ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఆమెను ఎంపీగా బరిలోకి దింపేందుకు బాబు హామీ ఇవ్వడంతో తోట సీతారామ లక్ష్మి కాస్త శాంతించారని జిల్లా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గత ఎన్నికల్లో ఈ సీటును బాబు ఉండి మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివకు కేటాయించారు. ఆ ఎన్నికల్లో శివ స్వల్ప తేడాతో ఓడిపోగా అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
షాకింగ్ నిర్ణయమే…..
ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ సీటుపై తోట సీతారామ లక్ష్మికి ( ఆమె లేదా ఆమె తనయుడు ) హామీ రావడంతో ఆమె అలక వీడి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారు. ఒకవేళ రఘురామ కృష్ణంరాజు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలు వచ్చినా కూడా టీడీపీ నుంచి అక్కడ ఆమే బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నాయి. నరసాపురం ఎంపీ సీటు ఇప్పటి వరకు క్షత్రియ సామాజిక వర్గాలకే ప్రధాన పార్టీలు ఎక్కువగా కేటాయిస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు కాపు వర్గానికి చెందిన తోట సీతారామ లక్ష్మికి కేటాయిస్తానని హామీ ఇచ్చి షాకింగ్ నిర్ణయమే తీసుకున్నారని చెప్పాలి.
క్షత్రియుల అడ్డాలో….
అయితే వైసీపీ కాపు వర్గానికే చెందిన వంక రవీంద్రకు 2014లో ఛాన్స్ ఇవ్వగా, జనసేన నుంచి గత ఎన్నికల్లో నాగబాబు పోటీ చేశారు. ఇక 2014లో పోటీ చేసిన తోట సీతారామలక్ష్మి కూడా ఇక్కడ ఓడిపోయారు. అంటే మూడు ప్రధాన పార్టీలు కాపులకు సీట్లు ఇచ్చినప్పుడు వారు విజయం సాధించలేదు. మరి బాబు ఈక్వేషన్లు ఎలా ఉన్నాయో ? తోట సీతారామ లక్ష్మి క్షత్రియుల అడ్డాలో ఎంత వరకు పట్టు సాధిస్తారో ? అన్న ప్రశ్నలకు కాలమే ఆన్సర్ చేయాలి.