వస్తాడు మా బాబు ఆ రోజు…?
చంద్రబాబు ఎక్కడ ఉన్నా ఆయన రాజకీయ రధం మాత్రం బాగానే జోరుగా తిరుగుతోంది. జూం యాప్ తో జాం జాం గా హైదరాబాద్ నుంచే కధ నడిపించేస్తున్నారు. [more]
చంద్రబాబు ఎక్కడ ఉన్నా ఆయన రాజకీయ రధం మాత్రం బాగానే జోరుగా తిరుగుతోంది. జూం యాప్ తో జాం జాం గా హైదరాబాద్ నుంచే కధ నడిపించేస్తున్నారు. [more]
చంద్రబాబు ఎక్కడ ఉన్నా ఆయన రాజకీయ రధం మాత్రం బాగానే జోరుగా తిరుగుతోంది. జూం యాప్ తో జాం జాం గా హైదరాబాద్ నుంచే కధ నడిపించేస్తున్నారు. తాను ఎక్కడ ఉన్నా జగన్ కాళ్ళకు బ్రేకులు వేసేస్తున్నారు. ఏపీలో ఎంత రాజకీయ అలజడి రేపాలో అంతా రేపుతున్నారు. మరి చంద్రబాబు ఎందుకు ఏపీకి రావడం. ఆయన లేనిదెక్కడ, సర్వాంతర్యామిగా ఉన్నాడుగా అని డౌట్ ఎవరికైనా రావచ్చు. కానీ బాబు రావాల్సింది, కావాల్సింది తమ్ముళ్లకేనట. తమ్ముళ్ళు బేలగా జాలిగా బాబు వైపు చూస్తున్నారు. ఎక్కడో దూరానా కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు అంటూ చంద్రబాబుపై కార్యకర్తలు చిర్రుబుర్రులాడుతున్నారు. మీరు ఎక్కడో ఉంటే ఎలాగండీ. కనీసం ఏపీలో ఉన్నట్లు అయినా కలరింగ్ ఇవ్వండి బాబూ అని పెద్ద నాయకులైతే కాస్తా గట్టిగానే సూచిస్తున్నారు.
చల్లగా కబురు….
సరే అందరూ అంటున్నారు కదా అని చంద్రబాబు తన మనసులో మాటను చల్లగా చెప్పేసారు. తాను ఏపీకి వస్తానని కూడా ఆయన శుభవార్త వినిపించారు. ఏకంగా రాష్ట్రమంతటా పర్యటిస్తానని కూడా చెప్పుకొచ్చారు. కానీ అదంతా ఇపుడు కాదుట. కరోనా పూర్తిగా తగ్గాకే తాను ఏపీలో టూర్లు చేస్తానని చంద్రబాబు కచ్చితంగా చెప్పేశారు. దాని మీద నో అప్పీల్. ఎందుకంటే ఆయన అధినాయకుడు. ఆయన మాటే ఎవరికైనా వేదవాక్కు. ఇక ఆయన ఏపీకి ఎందుకు రావడంలేదూ అని ఇన్నాళ్ళూ అడుగుతున్నారు, దానికి ఆయన ఇచ్చిన సమాధానం కూడా చక్కగానే ఉంది. దీంతో ఇక తమ్ముళ్ళు నిగ్గదీసి అడగలరా అన్నదే ఇపుడు టీడీపీలో చర్చగా ఉందిట.
తగ్గేదెపుడు….?
ఇప్పటికి ఏడు నెలలు అయింది ఏపీతో సహా దేశాన్ని కరోనా అతలాకుతలం చేస్తోంది. ఇది ఎన్నాళ్ళొ ఉంటుంది అన్నది పుట్టించిన చైనా వాడే చెప్పలేడు. ఇక వ్యాక్సిన్ అన్నది ఒక బ్రహ్మ పదార్ధంగా ఉంది. అదిగో ఇదిగో అంటూనే 2020 మెల్లగా కరిగిపోతోంది. వచ్చే ఏడాది లో కరోనా వ్యాక్సిన్ రావచ్చు అని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఈ మధ్యనే చెప్పారు. దాన్ని బట్టి చూస్తే కరోనా వ్యాక్సిన్ రావడానికి ఎలా అనుకున్నా 2021 మొదది అర్ధభాగం పూర్తి అవుతుంది. ఆ లెక్కన బాబు ఏపీకి రావాలంటే కనీసం మరో ఏడాది పడుతుంది అని తమ్ముళ్లే లెక్కలు వేసుకుంటున్నారిపుడు.
పార్టీ పదిలమేనా….?
అదే కదా ఇపుడు తమ్ముళ్లకు వచ్చిన పెద్ద బాధ. చంద్రబాబు ఏపీలో లేని టైంలో ఇద్దరు ఎమ్మెల్యేలు గోడ దూకారు. ఇపుడు మరింతమంది కూడా వైసీపీకి జై కొట్టేట్లుగా ఉన్నారు. సరే పెద్ద నాయకులు టీడీపీకి దెబ్బకొట్టడం ఇప్పటి మాట కాదు, ఎప్పటి నుంచో ఆ ముచ్చట ఉంది అనుకున్నా ఇపుడు క్యాడర్ కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురు అవుతోంది. వైసీపీ తెలివిగా టీడీపీలోని కీలక నాయకులను తమ పార్టీలోకి లాగేస్తోంది. ఇక మరో వైపు లోకల్ బాడీ ఎన్నికలు జరిగేనాటికి వార్ వన్ సైడ్ చేయడానికి వైసీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇవన్నీ చూసిన మీద తమ్ముళ్ళు చెబుతున్న మాట ఒక్కటే. కరోనా తగ్గిన తరువాత చంద్రబాబు ఏపీకి వచ్చినా పార్టీ ఉంటుందా అన్నదే పెద్ద డౌటుట. మరి బాబు మాత్రం ఏం చేస్తారు. అక్కడ ఉన్నది కరోనా. అందువల్ల అది పోతేనే కానీ ఆయన ఏపీకి రాలేరు కదా. ఇదీ టీడీపీలో సీన్.