కదలకపోతే ఎలా? కనికరం చూపకుంటే ఎలా?
స్వచ్ఛందంగా దేశాన్ని స్తంభింప చేసుకున్నాం. దేశంలోని దాదాపు 70 కోట్ల మంది ప్రజల జీవనస్థితిగతులు తలకిందులవుతాయని అంచనా. మళ్లీ ఎన్నాళ్లకు ఆర్థికంగా కోలుకుంటారో చెప్పలేం. అయినా కరోనా [more]
స్వచ్ఛందంగా దేశాన్ని స్తంభింప చేసుకున్నాం. దేశంలోని దాదాపు 70 కోట్ల మంది ప్రజల జీవనస్థితిగతులు తలకిందులవుతాయని అంచనా. మళ్లీ ఎన్నాళ్లకు ఆర్థికంగా కోలుకుంటారో చెప్పలేం. అయినా కరోనా [more]
స్వచ్ఛందంగా దేశాన్ని స్తంభింప చేసుకున్నాం. దేశంలోని దాదాపు 70 కోట్ల మంది ప్రజల జీవనస్థితిగతులు తలకిందులవుతాయని అంచనా. మళ్లీ ఎన్నాళ్లకు ఆర్థికంగా కోలుకుంటారో చెప్పలేం. అయినా కరోనా వైరస్ ను కట్టడి చేయాలనే సత్సంకల్పంతో ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తున్నారు. అక్కడక్కడా నిషేధ సడలింపు వేళల్లో విచ్చలవిడితనం కనిపిస్తోంది. కానీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం లేదు. సర్కారీ నిర్ణయానికి ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు ఇది. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకోవాల్సిన ఒక అనివార్యత ను గుర్తు చేసింది కరోనా. ఆరోగ్యరంగాన్ని ప్రయివేటు పరం చేసి పక్కా వ్యాపార మయం చేయడంలో ప్రభుత్వాలు తమ పాత్రను తోసిపుచ్చలేవు. వివిధ వ్యక్తిగత పథకాలు ప్రవేశపెట్టి కార్పొరేట్ ఆసుపత్రులను పోషించడం మినహా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించాయి. నేతల పేర్లతో స్కీములు తప్ప ప్రజారోగ్యాన్ని పటిష్టం చేయడంలో ప్రభుత్వాలన్నీ విఫలమవుతూనే వస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే దీనిని క్రమేపీ వదిలించుకుని చేతులు దులుపుకునే దశకు చేరాయి. ఈ స్థితికి చేరిన తర్వాత ప్రపంచాన్ని కమ్మేస్తున్న కరోనా భారత్ ను సైతం పునరాలోచింపచేస్తోంది.
దేశం దుస్థితి…
ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ముఖ్యమంత్రులందరూ దాదాపు చెప్పినమాట ఒకటే. తమ వద్ద తగినన్ని ఆరోగ్యసదుపాయాలు లేవు. వసతులు లేవు. వైద్యసిబ్బంది లేరు. ఇది ఒక్కరోజులో హఠాత్తుగా తీర్చేది కాదు. కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు ఇంతవరకూ ఏం చేస్తున్నట్లు? గడచిన 73 ఏళ్ల భారత స్వాతంత్ర్య చరిత్రలో గడచిన 20 ఏళ్లుగానే కార్పొరేట్ వైద్యరంగం విజృంభించింది. అంతవరకూ గ్రామీణ స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ వరకూ ప్రభుత్వాలే నిర్వహించుకుంటూ వచ్చాయి. ప్రభుత్వాలకు ఉండే నిధులు, వనరులు ప్రయివేటు వ్యక్తులకు సాధ్యం కాదు. అయినా అత్యున్నత వైద్య వ్యవస్థను కార్పొరేట్ రంగం కైవసం చేసుకోగలిగింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వాలు ఇందుకు సహకరించాయి. క్రమేపీ ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. అలాగని వ్యయం తగ్గలేదు. వివిధ రూపాలలో వ్యక్తిగత ఆరోగ్య లబ్ధి పథకాలు ప్రవేశపెట్టి ఆ నిధులను కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లించాయి. ప్రభుత్వ రంగాన్ని పణంగా పెడుతూ గడచిన పదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో సాగిన తంతు ఇది. ఉత్తరభారతంలో రాష్ట్రప్రభుత్వాలకు పెద్దగా ఆదాయం లేకపోవడంతో వైద్యం పై దృష్టి పెట్టలేదు. దక్షిణాదిలో మంచి వనరులు ఉన్నప్పటికీ సర్కారీ సేవలను పరిమితం చేసుకుంటూ వచ్చారు. ఫలితంగా పెద్ద స్థాయిలో మౌలిక వసతులు ప్రభుత్వాసుపత్రుల్లో లోపించాయి.
సంఘీభావం లో ఐక్యత…
భారతీయత అన్న ఏకైక నినాదం ఈ సందర్భంలో ప్రతిధ్వనిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపునకు జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలు చాలా పెద్ద ఎత్తున ప్రతిస్పందించారు. ఆ స్పందనను చూసిన భరోసాతోనే 21 రోజుల లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాలే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కు నేతృత్వం వహించమని ప్రధాని నరేంద్రమోడీని కోరుతున్నాయి. ఇదంతా గర్వించాల్సిన సంగతే. కానీ దేశీయంగా ప్రజల్లో నెలకొంటున్న ఆందోళనకు సమాధానాలు దొరకడం లేదు. అసంఘటితంగా రోజువారీ కూలీతో బతుకుతున్న ప్రజలకు భరోసా లభించడం లేదు. ప్రభుత్వాలు తమ వద్ద ఉన్న నిధులను అర్హత, అనర్హతలతో సంబంధం లేకుండా నగదు రూపంలో పంపిణీ చేయడంపైనే దృష్టి పెట్టాయి. అనుత్పాదక వ్యయంగా సర్కారీ సొమ్ములు చెల్లిపోయాయి. అందువల్ల ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. కేంద్ర్ర ప్రభుత్వమే ఆదుకోవాల్సి ఉంటుంది. ప్రజల్లో స్ఫూర్తినింపడానికి ప్రధాని చేస్తున్న ప్రయత్నాలు భేషుగ్గానే ఉన్నాయి. అయితే ఆర్థికంగా ఆదుకునే విషయంలో మాత్రం ఆచితూచి ప్రవర్తించడమే విమర్శలకు తావిస్తోంది. ఇటువంటి విపత్కాలంలో కేంద్రం కొంత ఉదారంగా ఉండాలి. వనరుల సమీకరణకు సైతం కేంద్రానికి ఉండే వెసులుబాటులు రాష్ట్రాలకు ఉండవు.
తెలుగు రాష్ట్రాలు అంతంతే…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విస్తృత స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. మౌలిక వసతులపై పెట్టాల్సిన ఖర్చును అవసరానికి మంచి సంక్షేమానికి మళ్లిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు పెరిగిపోవడంతో సంక్షేమ పద్దు నానాటికీ పెరిగిపోతోంది. గతంలో బడ్జెట్ లో కనీసం 35 శాతం పెట్టుబడి వ్యయంగా అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించేవారు. ఇప్పుడు అది పదిశాతం కూడా లేని దుస్థితికి వచ్చేశాయి. ఈ విషయంలో కొంతవరకూ తెలంగాణ ప్రభుత్వం రికార్డు మెరుగ్గా ఉంది. రుణాలు తెచ్చి ప్రాజెక్టులపైన వెచ్చిస్తోంది. ఆంధ్రాలో అటువంటి పరిస్థితి సైతం కనబడటం లేదు. తాజాగా కేంద్రం విడుదల చేసిన రెవిన్యూ లోటు నిధులే ప్రస్తుతానికి రాష్ట్రానికి ఆసరాగా చెప్పుకోవాలి. వచ్చే నెలలో అన్నిరకాల పన్ను ఆదాయం నిలిచిపోవడంతో మరింత గడ్డుకాలం తప్పకపోవచ్చు. ఈనెల పదిహేనో తేదీ వరకూ ప్రభుత్వానికి లభించే ఆదాయం దాదాపు మృగ్యం . కనీసం అయిదువేల కోట్లరూపాయలు ఖజానాకు రాకుండా పోతుందని అంచనా. లాక్ డౌన్ తర్వాత పూర్తి స్థాయి వ్యాపార కార్యకలాపాలకు అనుమతులిస్తేనే ఆదాయం క్రమేపీ పుంజుకుంటుంది. ప్రస్తుతం వెల్లడవుతున్న అభిప్రాయాలను బట్టి చూస్తే పూర్తిగా సడలింపులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. కొన్ని రంగాలపై మరికొంతకాలం నిషేధం అమలు కావచ్చంటున్నారు. అందువల్ల ప్రభుత్వాలు ఆదాయపరంగా పూర్తిగా గాడిన పడటానికి మరింత వ్యవధి పట్టవచ్చు. అందువల్ల కష్టకాలంలో అయినా మేలుకొని అనుత్పాదక వ్యయాలకు కళ్లెం వేసి వ్యవస్థను బాగు చేసుకుంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ఇటువంటి విపత్తులు ఎదురైనప్పుడు దీటుగా ఎదుర్కొనే సన్నద్ధత సమకూరుతుంది.
-ఎడిటోరియల్ డెస్క్